అమరావతి: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పొటెత్తుతోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే గరిష్ట నీటి మట్టం ఉండగా ఇన్ప్లో 53వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 70 గేట్లను ఎత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఇలాగే కొనసాగితే రేపటికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ నదీపరివాహక ప్రాంత అధికారులతో టెలికాన్షరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నదిలోకి ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,09,853 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,51,820 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్కు 1,37,233 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,56,260 క్యూసెక్కులు కాగా 1,96,554 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున కృష్ణానదికి మళ్లీ వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.