సినిమా రంగం అంటే గ్లామర్ ప్రపంచం. సాధారణంగా సినిమా తారలు వారి సినిమాలు, వ్యాపారాలకే పరిమితం అవుతుంటారు. తమ చుట్టూ ఉన్న ప్రజలు గురించి, ప్రజా సమసల్య గురించి చాలా తక్కువ సందర్భాల్లోనే స్పందిస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, యువ నటీనటులందరూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. వీరందరికీ సోషల్ మీడియా మాధ్యమంగా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా ద్వారా ప్రజా సమస్యలపై సినీ తారలు స్పందిస్తున్నారు. తాజాగా యురేనియం నిల్వల కోసం తెలంగాణ ప్రభుత్వం నల్లమల అడవుల్లో తవ్వకాలు జరపాలనే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పలువురు రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు తప్పు పడుతున్నారు. నల్లమలలో తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, శేఖర్ కమ్ముల. నాగాశ్విన్, అనసూయ తదితరులు నల్లమల అడవులను కాపాడాలంటూ `సేవ్ నల్లమల` ఉద్యమాన్ని లేవదీశారు. నల్లమల అడవులను నాశనం చేసి పర్యావరణాన్ని పాడు చేయవద్దంటూ ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు విన్నపం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. “నల్లమలలో యురేనియం తవ్వకాలపై మీ అభిప్రాయం విన్నాను. దీని గురించి ముఖ్యమంత్రి కేసీఆర్గారితో వ్యక్తిగతంగా చర్చిస్తాను“ అని రిప్లై ఇచ్చారు.
దీనికి హీరో విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ “ఇది మన మొదటి విజయం. మన అభిప్రాయాలను మనం వినిపించాం. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనుంది. ఇది పూర్తయ్యే వరకు ప్రయత్నాన్ని ఆపొద్దు. అమ్రాబాద్ ప్రజలకు, నల్లమలకు నాతో పాటు చాలా మంది సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది“ అన్నారు.