హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం తానేనని జరుగుతన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశంపై మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను కాబోయే సీఎం అన్నది వాస్తవం కాదన్నారు. తానే సీఎంగా కొనసాగుతానని సీఎం కేసీర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. అయినా.. కేటీఆర్ సీఎం అని మళ్లీ ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. కేసీఆరే తమ సీఎం అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ తో తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉన్నాం కనుకనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగామని మంత్రి కేటీఆర్ అన్నారు. చంద్రబాబు హయాంలో కూడా ఏపీతో సత్సంబంధాలు కొనసాగాయని గుర్తుచేసుకున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉమ్మడి ప్రాజెక్టును పక్కన పెట్టలేదని, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టామని రెండు రాష్ట్రాల సీఎంలు ప్రకటించలేదని చెప్పారు.
తెలంగాణలో కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతం తెలిసిందే. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ను కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనున్నారని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. మున్సిపల్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజాగా కేటీఆర్ ఇచ్చిన క్లారిటీతో ఈ ప్రచారానికి తెర పడింది.
నిజానికి టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు ? అనేదానిపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. దీనిపై టీఆర్ఎస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కొందరు కేటీఆర్ కు మద్దతుగా ఉంటే.. పార్టీలోని మరికొందరు హరీష్ రావుకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ కీలక పాత్ర పోషించారని, అపారమైన రాజకీయ అనుభవం, చాణక్యత హరీష్ సొంతం అని అంటున్నారు. అందుకే.. కేసీఆర్ తర్వాత ఆ పొజిషన్ కి హరీష్ కరెక్ట్ గా సరిపోతారు అని పార్టీలో కొందరు వాదిస్తున్నారు. అయితే, కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టమైంది. కాబోయే సీఎం ఎవరు ? అనే అంశం టీఆర్ఎస్ లో వివాదానికి దారితీసే అవకాశం ఉండటంతో కేటీఆర్.. ఈ వివాదం మరింత ముదరకుండా ఫుల్ స్టాప్ పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.