(న్యూస్ అర్బిట్ డెస్క్)
గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుండంతో తీర ప్రాంతవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175గేట్లు పూర్తిగా ఎత్తివేసి 8లక్షల 60వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలంలోని 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు నాలుగు రోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి.
ధవళేశ్వరం వద్ద 10.6 అడుగులకు వరద నీటిమట్టం చేరింది. 11.75 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నేటి సాయంత్రానికి మొదటి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎగువ భద్రాచలం వద్ద వరద గోదారి పోటెత్తడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
24 గంటల్లో రాజమండ్రిలో వరద మరింత పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం దిగువన వశిష్థ, వైనతేయ, గౌతమీ ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి.
భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఊళ్లను ముంచెత్తుతోంది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతుండడంతో గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లంక గ్రామాల పంట భూములు గోదావరిలో కలిసిపోయాయి.
పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఉధృతికి ఏజెన్సీలోని జల్లేరు, బైనేరు, సుద్దవాగు, జైహింద్ కాలువ, రేగులకుంట కాలువతో పాటు పలు వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు.
ఒక పక్క శబరి, మరోపక్క గోదావరి రెండు నదులు ఉదృత ప్రవాహంతో తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాల్లోని కూనవరం ఉక్కిరిబిక్కిరవుతోంది. భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద సముద్రం ముందుకు చొచ్చుకువస్తోంది. సముద్రం దాదాపు వంద మీటర్లు ముందుకు చొచ్చుకురావడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. స్పిల్వే వైపు వరద పోటెత్తుతోంది. కాఫర్ డ్యామ్ కారణంగా గ్రామాలకు ముంపు పొంచి ఉందన్న హెచ్చరికలతో అధికారులు వరదను స్పిల్వే మీదుగా మళ్లిస్తున్నారు. రెండు లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్వే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా దిగువకు పంపిస్తున్నారు. స్పిల్వే గేట్ల క్లస్టర్ లెవెల్ ఎత్తు 25.72 మీటర్లు కాగా దాదాపుగా అంతే స్థాయికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరో అర మీటరు ఎత్తు పెరిగితే స్పిల్వే గేట్ల ద్వారా నీరు దిగువకు ప్రవహించనుంది.
వరద ఉదృతితో జనం అల్లాడుతుండగా మరో వరుణ గండం పొంచి ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక మరింత ఆందోళన కల్గిస్తోంది.
బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి నాల్గవ తేదీ నాటికి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంబడి గంటలకు 45 కిలో మీటర్ల నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు చేపట వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయానికి ఇన్ ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 836 అడుగులుగా ఉందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 57 టిఎంసిలుగా ఉందని తెలిపారు.