(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అసెంబ్లీ ముట్టడికి భారీగా రైతులు తరలివచ్చారు. అసెంబ్లీ కాంప్లెక్స్ నలువైపులా రైతులు చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో రైతులు, మహిళలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు.అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు లాఠీఛార్జ్కి దిగారు.
లాఠీ చార్జిలో పలువురు మహిళలు, రైతులు గాయపడ్డారు.అయినప్పటికీ పోలీసుల ఆంక్షలు తెంచుకుని రైతులు నలువైపులా సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం మెయిన్ గేట్ దగ్గరకు రాజధాని రైతులు చేరుకున్నారు. రైతులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రైతలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. సచివాలయం ఎదుట కాలువలోకి దిగి రైతులు, మహిళల నిరసనకు దిగారు.రైతుల ఆందోళనలు చిత్రీకరిస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. మీడియా దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు.
గల్లా జయదేవ్ అరెస్టు
ఏపి రాజధాని అమరావతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ను పోలీసులు అరెస్టు చేశారు. పలువురు రైతులతో కలిసి గల్లా తలపాగా చుట్టుకొని పొలాల మీదుగా అసెంబ్లీ వద్దకు చేరుకుంటుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.