అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజధాని అమరావతిలో కొనసాగించాలని హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం అవుతున్నది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు కావస్తున్నా హైకోర్టు ఏర్పాటు వ్యవహారం ఇంకా సందిగ్దంలోనే కొనసాగుతోంది. ఇటు కోస్తా ఆంధ్రా, అటు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకై న్యాయవాదులు ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గానీ మంత్రులు గానీ స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో న్యాయవాదుల్లో ఆందోళన పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో రాయలసీమ మినహా తొమ్మిది జిల్లాలలో నేటి నుండి ఈ నెల 25వ తేదీ వరకూ కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బార్ అసోసియేషన్ నేతలు నిర్ణయించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసిన సందర్భంలో హైకోర్టును కర్నూలుకు తరలించే దిశగా తమ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో పాటు ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించడంతో కలకలం రేగింది. నేలపాడులోనే ఏపి హైకోర్టు కొనసాగించాలని కోరుతూ గత నెలలో జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో న్యాయవాదులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలోనే హైకోర్టు కొనసాగిస్తే రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కక్షిదారులకు అనుకూలంగా ఉంటుందని జెఎసి నేతలు తెలుపుతున్నారు. తొమ్మిది జిల్లాలకు చెందిన న్యాయవాదులు అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని బలంగా వినిపిస్తున్నా ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ నోరు మెదపడం లేదు. హైకోర్టు తరలింపు వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలనీ, అమరావతి పరిధిలోనే హైకోర్టు కొనసాగించాలని జెఎసి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.