(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అంటే రాయలసీమ, కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్ర సమాంతరంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ప్రకటన చేశారు.
కోస్తా ఆంధ్ర అమరావతిలో శాసన రాజధాని, కోస్తా ఆంధ్రా విశాఖలో పరిపాలనా రాజధాని, రాయలసీమ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయతలపెట్టారు. ఆ మేరకు పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లులను ముందుగా మంత్రివర్గంలో ఆ తరువాత శాసనసభలో ఆమోదం తదుపరి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ కావడం అన్నీ జరిగిపోయాయి. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే ఈ బిల్లుల చట్టబద్దత అంశం హైకోర్టుకు చేరడం, స్టేటస్ కో ఉత్తర్వుల నేపథ్యంలో వికేంద్రీకరణ ప్రక్రియకు ఆటంకం కల్గింది. ఇక్కడ అసలు సమస్య న్యాయరాజధాని (హైకోర్టు)తో ముడిపడి ఉంది. హైకోర్టు ఉన్నంత మాత్రన రాజధాని కాదు అని కేంద్రం తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశం అని కూడా పేర్కొన్నది, ఈ మేరకు హైకోర్టులో ఒకటికి మూడు సార్లు అఫిడవిట్ రూపంలోనూ ఇచ్చింది కేంద్రం.
ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో ఒ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇక్కడ మన రాష్ట్రానికి అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం ప్రకారం.. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటే కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి కూడా అవసరం అని సెలవు ఇచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏకంగా అమరావతిలో రాష్ట్రపతి ఉత్తర్వులతో ఏర్పడిన హైకోర్టునే రాయలసీమలోని కర్నూలుకు తరలించాలని భావిస్తున్నారు. ఓ పక్క ఏపి హైకోర్టు తీరుపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అటు పార్లమెంట్లోనూ బయట విమర్శిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కర్నూలును న్యాయ రాజధానిగా తయారు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపి హైకోర్టు అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతున్నది.
ఇప్పటికే పలు ప్రభుత్వ నిర్ణయాలను ఏపి హైకోర్టు తప్పుబడుతూ తీర్పులను వెల్లడిస్తున్నది. తన పరిధి కాని హైకోర్టు అంశాన్ని జగన్మోహనరెడ్డి ప్రభుత్వం భుజాన వేసుకుని కర్నూలు వాసుసకు న్యాయరాజధాని అంటూ హామీ ఇవ్వడంపై ఇప్పడు సర్వాత్రా చర్చ జరుగుతోంది. పరిపాలనా రాజధాని విషయంలో అడ్డంకులు తొలగిపోయినా న్యాయరాజధాని విషయంలో మరిన్ని చిక్కుముడులు ఉన్నాయనీ, కర్నూలుకు హైకోర్టు తరలించడం అంత ఈజీ కాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ జగన్నాధుడు ఏమి చేస్తాడో చూడాలి.