జగన్ గారూ మీ చుట్టూ ఉన్న బృందం ఎక్కడ..? భజనలు చాలు వ్యూహాలు సిద్ధం చేయమను…!
మీ దగ్గర ఉన్న న్యాయ విభాగం ఎక్కడ…? నిద్దర చాలు లేచి కోర్టులో వాదించమను…!
మీరు నియమించుకున్న సలహాదారులెక్కడ…? రాజకీయాలు చాలు సలహాలివ్వమను…!
మీరు అక్కున చేర్చుకున్న ఐఏఎస్ బృందం ఎక్కడ..? లాబీయింగులు చాలు మెదడుకి పని పెట్టమను…! కోర్టులు ధిక్కరిస్తున్నాయి. విపక్షాలు వెక్కిరిస్తున్నాయి. మీ ఆలోచనలు చిన్నబోతున్నాయి. ఇప్పటికే అనేక వ్యతిరేక తీర్పులొచ్చాయి.., ఇంకా సిద్ధంగా ఉన్నాయి. ఇదే కొనసాగితే.., ఇలాగే ఉంటె ఐదేళ్లలో మూటగట్టుకుని అపఖ్యాతి చరిత్రలో నిలిచిపోతుంది. అప్రమత్తం సుమీ, అజాగ్రత్త ముంచుతుంది సుమీ…!
డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐ అంత దూరమా…??
వైద్యుడు సుధాకర్ కేసు సిబిఐ కి వెళ్ళవలసిన కేసేనా…? సీఎం గారూ మీరూ సగటు మనిషిగా ఆలోచించండి. అర్ధం చేసుకోండి..! ఒక చిన్న కేసుని చీల్చి, చెండాడి, పెద్దదిగా మారడానికి కారణం ఎవరు…? మాజీ మంత్రి వివేకా కేసు సిబిఐ కి ఇవ్వాలా వద్దా అని అన్ని వాదనలు జరిగాయి, చివరికి ఇచ్చారు…, సుగాలి ప్రీతీ కేసు సిబిఐ కి ఇవ్వాలా వద్దా అని అలోచించి ఇచ్చారు…! అవన్నీ మర్డర్ కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులు. కానీ డాక్టర్ సుధాకర్ కేసుకీ చాలా తేడా ఉంది. చివరికి ఈ కేసు కూడా సిబిఐ కి చేరింది అంటే అది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. సాధారణ వైద్యున్ని హైలైట్ చేసి, అతన్ని నానా ఇబ్బందులు పెట్టి.., చిన్న విషయాన్నీ ఇంత పెద్దదిగా మారడానికి కారణం ప్రభుత్వమే. ప్రణాళికా లోపమే. వైద్యున్ని సస్పెండ్ చేసే ముందు కనీసం అంతర్గత విచారణ చేయలేదు, తర్వాత నడిరోడ్డుపై కొట్టి తీసుకువెళ్లిన వీడియో లు వచ్చినప్పుడు ఒకసారి అతను మద్యం సేవించాడని, మరోసారి మతి స్థిమ్మితం సరిగా లేదని రెండు నివేదికలు ఇచ్చారు. వైద్యుడి విషయం హైలైట్ అవ్వకుండా జాగ్రత్తగా, చాకచక్యంగా డీల్ చేసి ఉంటె ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. వైద్యున్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేకపోయినా చేశారు, కొట్టాల్సిన అవసరం లేకపోయినా కొట్టారు. ఇవి కోర్టుకి ఆగ్రహం తెప్పించాయి.., అందుకే బంతిని సిబిఐ కోర్టులో వేసేసింది. ఇక ప్రభుత్వానికి అడుగడుగునా చమటలు తప్పవు. ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామం.
రంగుల్లో ఎందుకీ తలనొప్పులు…!
ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిలో ప్రణాళిక లేమి ఉంది. ఒకసారి కోర్టు వద్దు అన్న తర్వాత మరో రంగుని పార్టీకి దగ్గరగా ఉండేలా చూసుకోకుండా… మళ్ళీ అవేరంగులను వేశారు. దీనిలో కోర్టులు అభ్యంతరం చెప్తాయని తెలిసినా.., కోర్టులకు ఏం సమాధానం చెప్పాలి అనేది ముందు సిద్ధమవ్వలేదు. దీన్ని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగడం అనే నానుడితో పోల్చవచ్చు. ఎవరూ చూడరు, ఎవరికీ తెలియదు అనుకుంటే ఇలాగే ఉంటుంది. ప్రభుత్వం చేసే ప్రతి పనిని, తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని వంకలు వెతికేందుకు విపక్షాలు, ప్రజా సంఘాలు సిద్ధంగా ఉంటాయి. ఐపీస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు విషయం లో కూడా ప్రభుత్వం ఊహించని ఎదురు దెబ్బ తగిలించుకుంది.
చేతులూ, మూతులు కాలుతున్నాయి…!
కోర్టు కేసుల్లో నిలబడేవి వాదనలే. చట్టంలో లొసుగులు, కీలక పాయింట్లు పట్టుకుని గట్టిగా వాదిస్తే ఎటువంటి కేసులో అయినా నెగ్గుకురావచ్చు. ప్రభుత్వం చేసే ప్రతి చర్యను…, ఆమోదించే ప్రతి జీవోని సమర్ధిస్తూ వాదించగలిగా న్యాయనిపుణులు ప్రస్తుతం ప్రభుత్వం లేరు. ఉన్నా బహుశా నిద్దరలో ఉన్నారేమో. కోర్టులకు నివేదికలు ఇవ్వాల్సింది అధికారులు. వారు ఆ దశలో విఫలమవుతుంటే.., వాదనల దశలో లాయర్లు విఫలమవుతున్నారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఈ విషయంలో మరింత రాటు దేలాల్సి ఉంది. వరుసగా అపజయాలు ఇప్పటికిప్పుడు సీఎం జగన్ కి, వైసిపికి చేటు చేయకపోయినా ఇవన్నీ మచ్చలుగా మిగిలిపోతాయి. ప్రభుత్వం ఏర్పడగానే అనుబంధ సంఘాల లాబీయింగులు ఉంటాయి, కొత్త భజన పరులు పుట్టుకొస్తారు, కొత్త సలహాదారులు పైకొచ్చేస్తారు. వీళ్ళు చేయాల్సిన పనిని వదిలి, అధికారాన్ని ఎంజాయ్ చేస్తే ఇటువంటి చిక్కులే వస్తాయి. చిన్న చిన్న కేసుల్లో కూడా చేతులు, మూతులు కాల్చుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ 50 పాఠాల పుస్తకం హైకోర్టు ఇచ్చింది, అది చదివి నేర్చుకోకపోతే ఈరోజు వచ్చి చేరిన మరో మూడు పేజీల్లాగా… ఇంకా ఆ పుస్తకం బరువు పెరుగుతూనే ఉంటుంది. అదే భవిష్యత్తులో గుదిబండగా మారి ప్రతిపక్షాలను ఆయుధంగా మారుతుంది. నిద్దర లేచి, స్నానం చేసి.., పనులు చేసుకుంటే మంచిదే, లేకుండా మోతకు సిద్ధమవ్వడమే.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!