(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
సైరా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం హక్కులు సాక్షి న్యూస్ ఛానల్కు ఇవ్వడం చాలామందికి మిగుడు పడలేదు. ప్రత్యేకించి మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటి, ఈ కాంబినేషన్ ఏమిటి అన్న ప్రశ్నలు వారి నుంచి వినబడుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిగా నటిస్తున్న ఈ హిస్టారికల్ మూవీని కొణిదెల బ్యానర్ కింద ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 చిత్రం తర్వాత వస్తున్న ఈ చిరంజీవి స్టారర్పై ఫ్యాన్స్లో విపరీతమైన ఆశలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో సినిమానూ రాజకీయాలనూ విడదీసి చూడలేం. సైరా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ హక్కులు సాక్షి ఛానల్కు వెళ్లడంలో కూడా రాజకీయాలు ఉన్నాయన్న ఊహాగానాలను అందుకే ఎవరూ కొట్టివేయడం లేదు. సాక్షితో పాటు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో జెమినీ మ్యూజిక్కు లైవ్ హక్కులు ఇచ్చారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజరాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభకు వెళ్లి కేంద్రమంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలిపోవడంతో చిరంజీవి క్రియాశీల రాజకీయాలను పక్కన పెట్టి మళ్లీ చలనచిత్ర రంగంపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో ప్రస్తుత రాజకీయాలతో చిరంజీవిని ముడిపెట్టడం కాస్త కష్టం.
ఇక మిగిలింది ఆయన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టిడిపి-బిజెపి తరపున ప్రచారం చేశారు. మొన్నటి ఎన్నికలలో జనసేన వంటరిగా పోటీ చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెంచారు. దానికి తీవ్రంగా ప్రతిస్పందించిన వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని ఆరోపించారు.
ఇలాంటి పరిస్థితులలో సైరా చిత్రం ఈవెంట్ హక్కులు సాక్షి ఛానల్కు వెళ్లడం సహజంగానే మెగా అభిమానులకు సందేహాలు మిగిల్చింది. పైగా ఇలాంటి సినిమా ఈవెంట్ లైవ్ ప్రసారాలు సాక్షిలో వచ్చేది చాలా తక్కువ. నిజానికి ఇందులో రాజకీయాలు ఏమీ లేవు. ఓ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్రను కధాంశంగా తీసుకుని ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రంపై చిరంజీవి ఫ్యామిలీ భారీ బడ్జెట్ పెట్టింది. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
సైరా విడుదల అయిన తొలి రోజుల్లో ఎక్కువ షోలు ప్రదర్శించుకోవాలంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. స్వాతంత్ర్య సమరయోధుడి కథ కాబట్టి వినోదం పన్ను మినహాయింపు కూడా కోరవచ్చు. ఈ ఆలోచనలతో సైరా చిత్రం ఈవెంట్ హక్కులు సాక్షి న్యూస్ ఛానల్కు ఇచ్చారని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గాంధీ మహాత్ముడి పుట్టిన రోజైన అక్టోబర్ రెండున సైరా చిత్రం విడుదల కానున్నది.