గాంధీనగర్ సీటు నిరాకరణపై ఆగ్రహం
తిరస్కరణ తీరు అవమానకరం
పెద్దనాయకులెవరూ చెప్పలేదు కూడా
ఎల్.కె. అద్వానీ అనుచరుల మండిపాటు
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, లోహపురుషుడు ఎల్.కె. అద్వానీ తీవ్ర అవమానభారంతో రగిలిపోతున్నారు. లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తన పేరు తప్పించడం, దానికి పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడుతున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా ఏమీ అనకపోయినా, లోహపురుషుడు మాత్రం పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ‘‘లోక్సభ టికెట్ ఇవ్వకపోవడం పెద్ద సమస్య కాదు. కానీ, ఆ విషయంలో వాళ్లు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉంది. పెద్ద నాయకులెవరూ కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు’’ అని అద్వానీ సన్నిహిత సహచరుడు ఒకరు అన్నారు. గత ఆరు సార్లుగా గాంధీనగర్ నియోజకవర్గానికి అద్వానీయే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆ టికెట్ అమిత్ షాకు ఇచ్చారు. ఆయన లోక్సభకు పోటీ పడటం ఇదే తొలిసారి.
75 దాటితే అంతే..
బీజేపీలో నాయకుల రిటైర్మెంటు వయసుపై కఠిన నిబంధనలున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. వాజ్ పేయి హయాంలో ఉప ప్రధాన మంత్రిగా కూడా చేసిన అద్వానీ, మరో పది మంది నాయకులు 75 ఏళ్లకు పైబడిన వారే. వారందరికీ ఈసారి విశ్రాంతినిచ్చారు. జాబితా ప్రకటనకు కొద్ది రోజుల ముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం లాల్ వారందరికీ ఫోన్లు చేసి, రిటైర్మెంటు ప్రకటించాలని కోరారు. అయితే అద్వానీ (91) మాత్రం అందుకు అంగీకరించలేదు. పార్టీ సీనియర్లు తనకు ఫోన్ చేసి ఉండాలని ఆయన భావించారు. శాంతా కుమార్, హుకుందేవ్ యాదవ్, కల్రాజ్ మిశ్రా, భగత్ సింగ్ కొషియారీ, బీసీ ఖండూరీ, కరియా ముండా.. వీళ్లంతా ‘స్వచ్ఛందంగా’ రిటైరయ్యారు. వీరిలో శాంతా కుమార్, కల్రాజ్ మిశ్రా మాత్రమే ఆ మేరకు ప్రకటనలు చేశారు. మిగిలిన వాళ్లను జాబితానుంచి పక్కన పెట్టారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ (75)కు టికెట్ దక్కుతుందో లేదో ఇంకా తెలియలేదు. అలాగే కాన్పూర్ నుంచి మురళీ మనోహర్ జోషి ఉంటారో లేదో తెలియట్లేదు.
సూచనలకే పరిమితం
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్వానీ, వాజ్ పేయి, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లందరినీ ‘మార్గదర్శక మండలి’లోకి మార్చారు. అయితే, కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వీరిని ఎన్నడూ సంప్రదించలేదు. ఆ తర్వాతి సంవత్సరం నుంచి అద్వానీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి కూడా హాజరు కాలేదు. నెమ్మదిగా ఇతర కార్యక్రమాలకూ దూరమయ్యారు. 2014 ఎన్నికల సమయంలో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకూడదని పార్టీలో తీవ్రంగా ప్రయత్నించిన అద్వానీ.. చివరకు విఫలమయ్యారు. రెండు నెలలకే సీనియర్లందరితోపాటు ఆయనను కూడా పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు.