ఇప్పుడు మొదలయ్యింది అసలు విషయం…! ఇప్పుడే ఆరంభమయ్యింది జగనుకి అసలు సవాలు…! ఖజానాలో డబ్బు లేదు. ఆదాయం రావడం లేదు. రాష్ట్ర గ్రాంటులు, ఉపాధి హామీ నిధులు, పన్నుల ఆదాయం, ఇతర శాఖల ఆదాయాలు ఖర్చు అయిపోగా తాజాగా స్థానిక సంస్థల నిధులు మల్లింపు జరిగిపోయింది. ఇవి సర్దుబాటు కాకపోతే నగిరి మునిసిపల్ కమిషనర్ తరహాలోనే వీడియోలు, ఆడియోలు మరి కొన్ని వచ్చినా, టీడీపీ వెనుక ఉంటూ ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల అమలు, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేసిన ప్రత్యేక కార్యక్రమాలకు ఖర్చు అయిపోయాయి. ఇక ముందుంది అసలు సమస్య. స్థానిక సంస్థల నిధులను వాడుకోవడం రాజకీయ దుమారానికి తేరా లేస్తుంది. పంచాయితీలు, పట్టణాలు కనీస అవసరాలకు చిల్లర కూడా లేకపోవడం ఇప్పుడు కీలక సమస్యగా మారింది.
కేంద్రం వేసింది… కానీ…!
స్థానిక ఎన్నికలు జరగకుంటే స్థానిక సంస్థలకు 14 వ ఆర్ధిక సంఘం నిధులు రావని భయపడి ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ కరోనా పుణ్యమా అని అవి వాయిదా పడ్డాయి. కానీ కేంద్రం పెద్ద మనసుతో ఈ నిధులను ఇచ్చింది. పంచాయతీలకు రూ. 870 కోట్లు, పట్టణాలకు రూ. 441 కోట్లు వెరసి రూ. 1381 కోట్లు కేంద్రం ఇచ్చింది, 25 రోజుల కిందటే స్థానిక సంతల ఖాతాలకు జమయ్యాయి. కానీ…! ప్రభుత్వంలో అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. కరోనా ప్రత్యేక సాయం కింద రూ, వేయి ఇవ్వాల్సి వచ్చింది (అది కేంద్రమే ఇచ్చినా ఇంకా జమ కాలేదు). రేషన్ అత్యవసరంగా ఇవ్వాల్సి వచ్చింది. ఇతర ఖర్చులు, నెల వారీ పింఛన్లు, ఇతర పథకాల అమలుకు స్థానిక సంస్థల నిధులే దిక్కయ్యాయి. ఆ 1381 కోట్లు చాలక పన్నుల రూపంలో ఖాతాల్లో ఉన్న మరో రూ. 2500 కోట్లు కూడా ప్రభుత్వం మళ్లించేసింది. ఇక్కడ ఈ మల్లింపులో ఏమి రాజకీయ ప్రయోజనాలు, ఇతర స్వార్ధ ప్రయోజనాలు లేవు… కానీ స్థానిక సంస్థలకు మాత్రం నష్టం, కష్టం తెచ్చాయి.
జీతాలకు లేవు…! అందుకే ఆవేదన…!
ఇప్పుడు మరో కీలక పాయింటుకి వద్దాం…! మొన్న నగరి మునిసిపల్ కమిషనర్ ఒక వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదన నిజమే, కాకపోతే ఆ ఆవేదన వెల్లడించాల్సి విధానమే తప్పు. అందుకే ఆయన మూల్యం చెల్లించుకున్నారు. మునిసిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలివ్వాలి, రోజూ బ్లీచింగ్ చల్లాలి, సుద్ధి చేయాలి, నిత్యం నిర్వహణ ఖర్చులు ఉన్నాయి. గడిచిన నెల రోజుల నుండి ఒక్క రూపాయి లేకుండా వారు పట్టణాలను నిర్వహిస్తున్నారు. సేమ్ పల్లెల పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే నగిరి కమిషనర్ లాగా మరో వంద వీడియోలు వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. “మీ జేబులో రూపాయి లేదు. ఇంటి అద్దె కట్టాలి, పనిమనిషికి జీతమివ్వాలి, నెలవారీ సరుకులు, బియ్యం తేవాలి, ఇతర బిల్లులు కట్టాలి” మీకు ఇన్ కా రావాల్సిన జీతం రాలేదు…! ఆ సమయంలో కలిగే ఫ్రెస్ట్రేషన్ మామూలుగా ఉండదుగా…. అదే స్థాయిలో కమిషనర్లు, గ్రామ కార్యదర్సులకు కలిగింది. ఇది ఇక్కడితో ఆగలేదు, ఏప్రిల్ నెల గడుస్తున్నా కొద్దీ మరింత ఒత్తిడి పెరుగుతుంది. కేంద్రం నుండి నిధులు రాకపోయినా, అత్యవసరంగా రాష్ట్రానికి వేరే మార్గాల్లో నిధులు రాకపోయినా భారీ సవాళ్లు ఎదురవుతాయి. అది జగన్ కు రాజకీయంగానూ ఇబ్బందే, గోతి కాడ ఎవరో కాచుకుని కూర్చున్నట్టు ఈయన ఎప్పుడు తప్పు చేస్తాడా అంటూ చంద్రబాబు బృందం రెడీగా ఉంది. దెప్పిపొడవడానికి, ఎత్తి చూపడానికి…!