(చిన్నారి గుడియాతో కానిస్టేబుల్ రేఖా నాగర్)
నాలుగు రోజుల పాటు అక్కడే
గాయాలు, ఆకలితో బతికిన చిరంజీవి
బాఘ్ పత్: ఒక ఏడాది వయసున్న గుడియా.. బాఘ్ పత్ లోని ఒక ఆస్పత్రిలో తలకు బ్యాండేజి కట్టి, ఖిచిడీ తింటూ.. తాజా గాలి కోసం బయటకు వచ్చింది. ఒక నర్సు ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని, వీపు మీద జో కొడుతూ ఉంది. బయటకు వెళ్తున్నామని చెప్పగానే ఆ చిన్నారి ఏడుపు మొదలుపెట్టింది. వార్డులో ఉన్న మహిళా కానిస్టేబుల్ వైపు చూసింది. ఆ మహిళా పోలీసు గుడియాను చేతుల్లోకి తీసుకుని, ఒక చెట్టు కిందకు వెళ్లింది. ఆ చిన్నారి ఆమె మెడచుట్టూ చేతులు వేసుకుని హాయిగా బజ్జుంది. నాలుగు రోజుల క్రితం ఒక మహిళ శవం పక్కనే బాఘ్ పత్ పొలాల్లో ఆ చిన్నారి దొరికింది. బహుశా ఆమే ఈ చిన్నారి తల్లి అయి ఉంటుందని భావిస్తున్నారు.
మహిళ శవం దాదాపు కుళ్లిపోయింది. చిన్నారి మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఆకలి, దాహంతో అలాగే బతికుంది. రెండు రోజులు వర్షం కూడా కురిసింది. ఆమె ఆ పొలం నుంచి పాక్కుంటూ దగ్గరలో ఉన్న ఓ ప్రార్థనామందిరం వద్దకు రాగా భక్తులు గమనించారు. తల్లీబిడ్డలు ఎవరన్న విషయం ఇంకా తెలియకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెకు గుడియా అని పేరుపెట్టారు. బరౌత్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ అయిన రేఖా నాగర్ ఆమె యోగక్షేమాలు చూస్తున్నారు. తాను ఉదయం 10 గంటలకు వచ్చి, రాత్రి 9కి వెళ్తానని ఆమె అన్నారు. గుడియా చాలా ధైర్యవంతురాలని, ఎన్ని కష్టాలున్నా ఆమె ప్రాణాలు నిలబెట్టుకుందని చెప్పారు. మొదట తెచ్చినప్పటికి, ఇప్పటికి ఆమె పరిస్థితి చాలా మెరుగైందని తెలిపారు.
గుడియా నుదురుమీద ఎడమవైపు పదునైన వస్తువుతో చేసిన గాయం ఉందని వైద్యులు చెప్పారు. తాము సీటీస్కాన్ చేసి చూడగా.. ఎముకలు దెబ్బతిన్నాయని, తలకు కూడా గాయం ఉందని తేలిందన్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా తల వాచిందని, అందువల్ల కుట్లు వేయలేకపోయామని అన్నారు. అయినా ఆమె కోలుకుంటుందన్న నమ్మకం ఉందని ఆస్థా ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజయ్ గార్గ్ తెలిపారు. పురుగుల వల్ల ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ చేరిందని, ఇక్కడకు తీసుకొచ్చిన చాలా గంటల పాటు స్పృహలో లేదని వైద్యులు అన్నారు. మెలకువ రాగానే ఒక బాటిల్ నీళ్లు, పాలు టకటకా తాగేసిందని చెప్పారు. యాంటీబయాటిక్స్ తో చికిత్స చేస్తూ.. గాయాలు నయం చేస్తున్నారు. పాప త్వరగా కోలుకుంటోందని, ఆమెను దత్తత చేసుకోడానికి కొందరు ముందుకొచ్చారని రేఖ తెలిపారు. ఇవేమీ తెలియని గుడియా మాత్రం రేఖ చేతుల్లో హాయిగా నిద్రపోయింది.