అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక్క చోట నుండే ఉండాలన్న అభిప్రాయాన్ని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ నుండి అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఆయన అన్నారు. మూడు రాజధానుల అంశంపై స్వర్ణభారతి ట్రస్ట్లో మీడియాతో ఇష్టాగోష్టిలో ఆయన స్పందించారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు తాను మొదటి నుండి కట్టుబడి ఉన్నానని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన కేంద్రీకృతం కావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలనీ, అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందనీ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
వివాదం కోసమో, రాజకీయ కోణం లోనో తన అభిప్రాయాన్ని చూడవద్దనీ, 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఈ మాట చెబుతున్నాననీ ఆయన అన్నారు. కేంద్రం తనను అడిగితే ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.
మాతృభాషకు ప్రాధాన్యం విషయంలో తనది మొదటి నుండి ఒకటే అభిప్రాయమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో ప్రాధమిక బోధన ఉండాలనేదే తన అభిమతమని అన్నారు. ప్రధాని మోది సైతం మాతృభాష ప్రాధాన్యంపై అనేక సార్లు చెప్పారని వెంకయ్య నాయుకు పేర్కొన్నారు.