Photos Credit: ND TV
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అత్యంత విషపూరితమైన సింధటిక్ పాలు తయారుచేసి ఏకంగా ఆరు రాష్ట్రలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ తమ బ్రాండ్ పేరుమీద పాలు అమ్మే సంస్థలు ఈ పాలను కొని వినియోగదారులకు విక్రయిస్తున్నాయి. ఎవరినైనా నివ్వెరపరిచే ఈ భయంకరమైన పనిని చేస్తున్నది మధ్యప్రదేశ్లో. చివరికి పాపం పండి పోలీసుల చేతికి చిక్కారు.
స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గ్వాలియర్ – చంబల్ ప్రాంతంలోని మూడు పాల ఫ్యాక్టరీలపై దాడి చేసి 15 మందిని అరెస్టు చేశారు. అక్కడ తయారయిన పాలు మధ్యప్రదేశ్లోనే కాక ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, మహరాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి.
పోలీసులు పది వేల లీటర్ల కల్తీపాలతో పాటు 20 ట్యాంకర్లనూ, 11 పిక్అప్ వ్యాన్లనూ కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో షాంపూ, సింధటిక్ చీజ్ కూడా దొరికింది.
ఆ ఫ్యాక్టరీలలో తయారవుతున్న పాలలో 30 శాతం అసలు పాలను కలుపుతున్నారు. రిఫైన్డ్ ఆయిల్, షాంపూ, వైట్ పెయింట్, గ్లూకోజ్ పౌడర్ కొన్ని పాళ్లలో కలిపి మిగతా పాల వంటి పానీయం తయారుచేస్తున్నారు. ఇదే పద్ధతిలో చీజ్ కూడా తయారుచేసి పశ్చిమ, మధ్య, ఉత్తర భారతదేశంలో పెద్ద స్థాయిలో సరఫరా చేస్తున్నారు.
ఈ పాలు తయారుచేయడానికి లీటరుకు అయిదు రూపాయలు ఖర్చవుతాయనీ, వాటిని మార్కెట్లో 45 నుంచి 50 రూపాయల రేటు వరకూ విక్రయిస్తున్నారనీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ మూడు యూనిట్లలో కలిపి రోజుకు రెండు లక్షల లీటర్ల సింధటిక్ పాలు తయారుచేస్తున్నారు. కొంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కూడా ఇందులో ప్రమేయం ఉందనీ, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామనీ పోలీసు వర్గాలు తెలిపాయి.