చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై దాఖలైన పిటిషన్ను శుక్రవారం మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ద్రవిడ ఉద్యమనేత తందై పెరియార్ పై రజనీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కళగం(డీవీకే) సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తమిళ ప్రజల మధ్య అలజడి రేకెత్తించేలా రజనీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై డీవీకే పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఈ విషయంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు ఎందుకొచ్చారంటూ పిటిషనర్ ను ప్రశ్నిస్తూ.. రజినీకాంత్ పై వేసిన పిటిషన్ను కొట్టేసింది.
ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను ద్రవిడ సంఘాలు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఆయనపై చేసిన వ్యాఖ్యలను గాను రజినీకాంత్ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలంటూ పెరియార్ అభిమానులు డిమాండ్ చేసారు. అంతేకాదు కొంత మంది పెరియార్ అభిమానులు నల్ల దుస్తులు ధరించి రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా చేసారు. అయితే, తాను అప్పట్లో కొన్ని పేపర్లో వచ్చిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రస్తావించాను తప్ప.. తానేమి తప్పు చేయలేదంటూ రజనీకాంత్ వివరణ ఇచ్చారు. తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
జనవరి 14న చెన్నైలో నిర్వహించిన ‘తుగ్లక్’ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ.. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో పెరియార్ సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది అప్పట్లో బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్త పడిందని, ఈ వార్తను కేవలం ఒకే ఒక్కతమిళ మేగజైన్ ప్రచురించిందని పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై ద్రావిడర్ విడుదలై కళగం(డీవీకే) నేతలు మండిపడ్డారు. పెరియార్ ర్యాలీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ద్రావిడర్ విడుదలై కళగం అధ్యక్షుడు నెహ్రూదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్ను కించపరిచిన రజనీకాంత్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.