ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రయాణీకుల రైలు పట్టాలపై నిలిచిపోయింది. దాదాపు 700 మంది ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుండీ అందులో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం రెండు మిలటరీ హెలీకాప్టర్లను పంపించింది. జాతీయ విపత్తు సహాయక దళం బృందాలు ఆరు బోట్లలో తరలివెళ్లారు. చివరికి మొత్తం అందరినీ రక్షించి బయటకు తెచ్చారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో జనజీవనం స్థంభించిపోయింది. నాలుగు వైపులా నీరు అయిదారు అడుగుల ఎత్తున కమ్ముకోవడంతో ముంబై – కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ ధానే జిల్లాలోని వంగేని సమీపంలో పట్టాలపై నిలిచిపోయింది. ప్రయాణికులు సహాయం అర్ధిస్తూ సెల్ఫోన్లలో వీడియోలు తీసి పంపడంతో వారి సంగతి తెలిసింది.
#WATCH Maharashtra: Mahalaxmi Express held up between Badlapur and Wangani with around 2000 passengers. Railway Protection Force & City police have reached the site where the train is held up. NDRF team to reach the spot soon. pic.twitter.com/0fkTUm6ps9
— ANI (@ANI) July 27, 2019
బయట ప్రమాదకరమైన రీతిలో నీటిమట్టం ఉన్నందున రైలు దిగవద్దని అధికారులు ప్రయాణికులను హెచ్చరించారు. ఇప్పటికే 500 మందికి పైగా ప్రయాణికులను కాపాడామని అధికారులు చెప్పినట్లు ఎన్డి టివి తెలిపింది.
ధానే ప్రాంతంలోని బద్లాపూర్, ఉల్హాస్నగర్, వంగేని పట్టణాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాత్రంతా కురిసిన వానతో ముంబై నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సీజన్లో ముంబై నగరం జలదిగ్బంధంలో చిక్కుకోవడం ఇది రెండవసారి.
Video, Photo Courtesy: ANI
Video Courtesy: ABP News