న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష అసెంబ్లీ వేదికగా జరగాలే తప్ప, రాజ్ భవన్ లో కాదని న్యాయస్థానం పేర్కొంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించింది. బల పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ప్రొటెమ్ స్పీకర్ ను తక్షణమే నియమించాలని, మొత్తం అసెంబ్లీ సమావేశాలను చిత్రీకరిస్తూ, లైవ్ టెలికాస్ట్ చేయాలని కూడా ఆదేశించించింది. రేపు ఉదయం నుంచి సాయంత్రంలోగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావాలని, ఆ వెంటనే బల పరీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేసింది. బల పరీక్షలో రహస్య ఓటింగ్ ను జరపరాదని కూడా సుప్రీం కోర్టు సూచించింది.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై.. జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్న త్రిసభ్య ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో మంగళవారం తీర్పు వెలువరించింది.
మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన 56 సీట్లు గెలిచింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కొత్తగా ఏర్పడిన ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఆ మూడు పార్టీలు పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి ఎమ్మెల్యే సంతకాలతోకూడిన లేఖను కూడా సమర్పించాయి. అంతేకాదు ముంబైలోని హయత్ స్టార్ హోటల్ వేదికగా మూడు పార్టీలూ సోమవారం రాత్రి 162 మంది ఎమ్మెల్యేలను పరేడ్ చేశాయి.
మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు మధ్య సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ నవంబర్ 23న ప్రమాణస్వీకారం చేశారు. వాస్తవానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహారాష్ట్ర వికాస్ అఘాడిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-ఎన్సీపీ అంగీకారం తెలిపాయి. శనివారం(నవంబర్ 23) మూడు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన చేశారు. అయితే, రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోయాయి. ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయగా.. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు.