న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. అంతకు ముందు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ… ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు గడువు ఉన్నప్పటికీ… ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్రానికి నివేదిక సమర్పించారు. గవర్నర్ సిఫారసును మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం కేంద్ర కేబినెట్ సిఫారసు, మహారాష్ట్ర గవర్నర్ నివేదికను రాష్ట్రపతి భవన్ కు పంపారు. ఆ వెంటనే కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
మహారాష్ట్రలో నవంబర్ 8న అసెంబ్లీ గడువు ముగిసిపోవడంతో సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగారు. తొలుత ప్రభుత్వ ఏర్పాటుపై చేయాల్సిందిగా 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించాగా.. తాము ప్రభుత్వ ఏర్పాటు చేయలేమని ఆపార్టీ గవర్నర్ కు తెలియజేసింది. దీంతో 56 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు బలాన్ని, సమ్మతిని తెలియజేయాలని సూచించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మరింత గడువు కోరగా.. అందుకు గవర్నర్ తిరస్కరించారు. ఇక 54 స్థానాలతో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరారు. అయితే, ఎస్సీపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేన పార్టీలకు సీఎం పీఠం వద్ద పేచీ వచ్చింది. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగింది. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే, అయితే సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా ప్రతిపాదించింది. సీఎం పీఠాన్ని పంచుకోవాలని కోరగా.. అందుకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.