బిహార్: మూకదాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓజాపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్ తదితర 49 మంది ప్రముఖులపై దాఖలైన దేశద్రోహం కేసును ఎత్తివేసినట్లు ముజఫర్ పూర్ పోలీసులు అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు. పిటిషనర్పై చర్యలకు సిఫారసు చేసినట్లు చెప్పారు. కేవలం ప్రచారం పొందడానికే ఈ పిటిషన్ను దాఖలు చేశారన్నారు.
ఈ పిటిషన్ను న్యాయవాది సుధీర్ ఓజా దాఖలు చేశారు. ఆయనకు లోక్జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పార్టీ ఎన్డీయే మిత్ర పక్షం కావడంతో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ఈ కేసు తలనొప్పిగా పరిణమించింది. సుధీర్ ఓజాకు చిల్లర పిటిషన్లు దాఖలు చేయడం అలవాటని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ తెలిపారు.
మూకదాడులు దేశంలో ఏ మాత్రం సరైనవి కావని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దసరా సందర్భంగా మంగళవారం నాగపూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘మూకదాడులు, సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుంది. మూకదాడులు భారత సంస్కృతి కాదు’ అని పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే.. సెలెబ్రిటీలపై నమోదు చేసిన దేశద్రోహం కేసును పోలీసులు ఎత్తివేయడం గమనార్హం.
దేశంలో మూక దాడులు పెరుగుతున్నాయని, జై శ్రీరామ్ నినాదాన్ని రెచ్చగొట్టేందుకు వాడుతున్నారని ఆరోపిస్తూ, ఇటువంటి సంఘటనలపై స్పందించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 49 మంది మేధావులు ఈ ఏడాది జూలైలో లేఖ రాసిన విషయం తెలిసిందే. మణిరత్నం,రేవతి, అపర్ణా సేన్, శ్యామ్ బెనెగల్, రామచంద్ర గుహ, వంటి ప్రముఖులు ఈ లేఖ రాసినవారిలో ఉన్నారు. అయితే మోదీకి లేఖ రాసిన ప్రముఖులపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో బీహార్ లోని పోలీసు ఉన్నతాదికారులు ఆ ఫిర్యాదును ఉపసంహరించాలని నిర్ణయించారు.