(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కోల్కతా: మీరేమన్నా పాకిస్థాన్ రాయబారా? ఎందుకు ప్రతిసారీ పాకిస్థాన్ ప్రస్తావన తెచ్చి ఆ దేశాన్ని గొప్పదాన్ని చేస్తారు? ఈ ప్రశ్న ఎదురయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. ఇలా ఆయనను ప్రశ్నించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
సిలిగుడిలో శుక్రవారం ఒక బహిరంగసభలో ప్రసంగించిన మమత ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘ఇండియా చాల పెద్ద దేశం. దీనికి చాలా గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద ఉన్నాయి. ఎందుకు మీరు చీటికిమాటికీ మన దేశాన్ని పాకిస్థాన్తో పోలుస్తారు. మీరు మాట్లాడాల్సింది హిందూస్థాన్ గురించి. మీరు భారత దేశానికి ప్రధానమంత్రా లేక పాకిస్థాన్కు రాయబారా’ అని మమతాదీ ప్రశ్నించారు.
‘ఎవరన్నా వచ్చి ఉపాధి లేదు ఉద్యోగం కావాలి అంటే ప్రధాని మోదీ పాకిస్థాన్ వెళ్లమంటారు. పరిశ్రమలు లేవని ఎవరన్నా అంటే ప్రదాని పాకిస్థాన్ వెళ్లండి అంటారు. పాకిస్థాన్ సంగతులు పాకిస్థాన్ చూసుకోనివ్వండి. మనం మన సంగతులు చూసుకుందాం’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వం జాబితాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.s