ఇండోర్: మన దేశంలో పన్ను ఎక్కువగా ఎగవేసిన వారు ఎవరని ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే తీర్చుకోవాలనుకుని ఆదాయపన్ను శాఖకు ఆర్టీఐ ద్వారా ఒక ప్రశ్న అడిగారు. అంతే.. గత ఏడాది కాలం నుంచి ఏకంగా 3వేల ఉత్తరాలు, 50 ఈ మెయిళ్లు అందాయి. ఈ వింత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సమీపంలో జరిగింది. నీముచ్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ గత సంవత్సరం ఫిబ్రవరి 25న ఆర్టీఐ ద్వారా ఆన్ లైన్ ప్రశ్న అడిగారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ను 50 మంది అతిపెద్ద పన్ను ఎగవేతదారుల జాబితాను కోరారు. దాంతోపాటు, గత పదేళ్లలో ఎవరెవరి ప్రత్యక్ష పన్నులను రద్దుచేశారని ప్రశ్నించారు.
2018 ఫిబ్రవరి 25వ తేదీన తాను ఈ ప్రశ్న అడిగానని గౌడ్ వివరించారు. అయితే, సీబీడీటీ వాళ్లు మొత్తం జాబితాను సమగ్రంగా పంపలేదని ఆయన వాపోయారు. దానికి బదులుగా తన దరఖాస్తును దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ కార్యాలయాలకు ఫార్వర్డ్ చేశారని చెప్పారు. దాంతో ఆ కార్యాలయాలు అన్నింటి నుంచి గత ఏడాది కాలంగా 3వేలకు పైగా ఉత్తరాలు, 50 ఈ మెయిళ్లు వచ్చాయని అన్నారు. అవి ఇంకా రావడం ఆగలేదట.. అలా వస్తూనే ఉన్నాయట. దాంతో వాటిలో ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకోలేక జుట్టు పట్టుకుంటున్నారు.