(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది.
మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని ప్రాంత గ్రామాల మహిళలు మొక్కుబడులు చెల్లించుకునేందుకు కలశాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో దుర్గమ్మకు మొక్కుబడులు చెల్లించుకోవడం మందడం మహిళల సంప్రదాయం.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్తో రాజధాని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్న కారణంగా ఈ నెల 10వ తేదీన రాజధాని గ్రామాల నుండి దుర్గమ్మకు మొక్కుబడులు చెల్లించుకునేందుకు బయలుదేరిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు మహిళలను సైతం అదుపులోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కొందరు మహిళలు దుర్గగుడి వరకూ వెళ్లి మొక్కుబడులు చెల్లించుకున్నారు.
ఆనాడు పోలీసులు ప్రవర్తించిన తీరుపై హైకోర్టులో రాజధాని రైతులు పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసుల చర్యలను హైకోర్టు తప్పుబట్టింది. తీవ్రంగా మందలించింది.
ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శిరస్సుపై కలశాలను పెట్టుకుని ఊరేగింపుగా దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.
వీరి ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో మహిళలు ప్రశాంతంగా అమ్మవారికి పొంగళ్ల సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. పోలీసులు ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండటంతో రైతులు, మహిళా హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అమారావతిలోనే కొనసాగించాలని అమ్మావారిని వేడుకున్నట్లు మహిళలు తెలిపారు.