(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్ తర్వాత గతంలో ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్న బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఆ రాక్షసులను కూడా ఇదే రీతిలో ఎన్కౌంటర్ చేసి తీరాలని పట్టుబడుతున్నారు.
కొన్ని నెలల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ కు చెందిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై మండల ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఓ వైపు దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్తో అందరూ పోలీసులు కీర్తిస్తుంటే.. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో ఇంతవరకూ ఏమీ చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిశ నిందితుల మాదిరిగానే హాజీపూర్ ఘటనలోనూ పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే శ్రీనివారెడ్డిని శిక్షించాలని కోరుతున్నారు.
దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ బాధిత కుటుంబీకులకు ఊరటనిచ్చి ఉండవచ్చు. అదే సమయంలో పలు బాధిత కుటుంబాల నుంచి ఇటువంటి డిమాండ్ రావడం మానవతావాదులను ఆశ్చర్యపరుస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని తెలిసినా బాధిత కుటుంబాలు దాన్నే ఒప్పుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే అయేషా మీరా తల్లి, ఆ తర్వాత సినీనటి ప్రత్యూష తల్లి తమకు జరిగిన అన్యాయంపై న్యాయం ఎప్పటికని ప్రశ్నించారు. వరంగల్ లో పందొమ్మిదేళ్ల బాలికను పుట్టినరోజునాడే అత్యాచారం చేసి చంపేసిన ఘటనపై ఆమె తండ్రి కూడా నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కోరారు.