న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియాకి చెందిన కార్ల విక్రయాలు ఆగస్టులో గణనీయంగా పడిపోయాయి. దీంతో మారుతి సుజుకి సంచనల నిర్ణయం తీసుకుంది. సంస్థ గురుగ్రామ్, మనేసర్లోని కార్ల తయారీ ప్లాంట్లను సెప్టెంబర్ 7, 9వ తేదీల్లో మూసివేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని కంపెనీ బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారం అందించింది.
మాంద్యం దెబ్బతో భారత్ లో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు నెలలో వాహన విక్రయాలు చరిత్రలో ఎన్నడు లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. గత నెలలో మారుతి సుజుకీ వాహన విక్రయాలు ఏకంగా రెండంకెల స్థాయిల్లో పడిపోయింది. అంతేకాదు విక్రయాలు 33 శాతం మేర క్షీణించాయి. వాహనాల అమ్మకాలు పడిపోవడంతో.. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆగస్టులో కార్ల విక్రయాలు ఏకంగా 32.7 శాతం పడిపోయి 1,06,413 యూనిట్లుగా నమోదైనట్లు ఇటీవల మారుతి సుజుకీ వెల్లడించింది. 2018 ఆగస్టు మాసంలో 1,58,189 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయని వివరించింది.