(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండటం, పలువురు ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంతో క్యాడర్లో నైరాశ్యం అలుముకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా భారీ స్థాయిలో ప్రక్షాళనకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 250 నుండి 300 వరకూ కొత్త వారికి పార్టీ పదవులు అప్పగించే దిశగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. నూతన రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి అధ్యక్ష పదవులు, అనుబంధ సంఘాలకు నేతలను ఎంపిక చేసే ప్రక్రియకు పార్టీ శ్రీకారం చుడుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీని గాడిలో పెట్టాలంటే మంచి వాగ్దాటి ఉన్న, సీనియర్ నేత అయిన కింజరపు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచన చేశారని వార్తలు వచ్చాయి. అయితే అచ్చెన్నాయుడు పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు అంతగా ఆశక్తి చూపడం లేదని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక వేళ అచ్చెన్నాయుడు పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోతే పార్టీ అధ్యక్ష పదవి రేసులో చింతకాయల అయ్యన పాత్రుడు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యనపాత్రుడు ఉన్నారని సమాచారం.
అచ్చెన్నకే మెజార్టీ వర్గాల మద్దతు
పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై చంద్రబాబు నాయుడు ఐవిఆర్ఎస్ సర్వే నిర్వహించగా 60 శాతం పైగా పార్టీ క్యాడర్ అచ్చెన్నాయుడు పేరునే సూచించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు ఇంతకు ముందు పార్టీ పగ్గాలు ఇచ్చి మళ్లీ ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రకే ఆ పదవి ఇవ్వడంపై కోస్తా ఆంధ్రా, రాయలసీమలో కొందరు నేతలు వ్యతిరేకించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాయలసీమ నుండి పార్టీ అధినేత చంద్రబాబు ఉండగా బిసి వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు అయితే తన వాగ్దాటి, సీనియారిటీతో పార్టీ బలోపేతానికి కృషి చేయగలరని పలువురు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐవిఆర్ఎస్ సర్వేలో మెజార్టీ పార్టీ కేడర్ అచ్చెన్నాయుడు పేరును సూచించడం వల్ల దాదాపు ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని బావిస్తున్నారు.
తెలుగు యువత అధ్యక్షుడి రేస్లో పరిటాల శ్రీరామ్
తెలుగు యువత అధ్యక్ష పదవిని గతంలోనే అనంతపురం జిల్లాకు చెందిన యువనాయకుడు పరిటాల శ్రీరామ్కు ఇవ్వాలని చంద్రబాబు యోచన చేసినప్పటికీ అప్పటి రాజకీయ కారణాల నేపథ్యంలో దేవినేని అవినాష్కు అప్పగించారు. ఎన్నికల అనంతరం దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేపథ్యంలో పరిటాల శ్రీరామ్కు ఈ సారి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నదట. తెలుగుయువత అధ్యక్ష పదవి రేసులో పరిటాల శ్రీరాంతో పాటు చింతకాయల అయ్యనపాత్రుడు కుమారుడు విజయ్ మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నిర్వహించిన ఐవిఆర్ఎస్ సర్వేలో 75 శాతం మందికిపైగా పరిటాల శ్రీరామ్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పరిటాల శ్రీరాం పేరు దాదాపు ఖరారు అవుతుంది అంటున్నారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికకు చంద్రబాబు కరసత్తు చేస్తున్నట్లు సమాచారం.