మాయావతి పాదాలు తాకిన డింపుల్ యాదవ్
ఆశీస్సులు అందించిన బీఎస్పీ అధినాయకురాలు
కనౌజ్: ఇలా పొత్తు కుదిరిందో లేదో.. అలా బంధుత్వాలు కూడా కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ నాయకులు బాగా దగ్గరైపోతున్నారు. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్నా, ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య, కనౌజ్ ఎంపీ డింపుల్ యాదవ్ బహిరంగ వేదికపై మాయావతి పాదాలకు నమస్కరించారు. దానికి మాయావతి కూడా తక్షణం స్పందించి ఆమెకు తన ఆశీస్సులు అందించారు. కనౌజ్ ఎన్నికల ప్రచారంలో ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ‘‘సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నన్ను కుటుంబంలో పెద్దగా గౌరవిస్తాడు. ఈ పొత్తు కుదిరిన తర్వాత డింపుల్ యాదవ్ ను నేను నా కుటుంబంలో సభ్యురాలిగా ఆమోదిస్తున్నాను’’ అని మాయావతి ఈ సందర్భంగా అన్నారు. డింపుల్ ను ఆమె ‘బహూ’ అని సంబోధించారు. ఆమెను రికార్డు మెజారిటీతో గెలిపించాలని కనౌజ్ ఓటర్లను మాయావతి కోరారు.
#WATCH Samajwadi Party leader Dimple Yadav takes blessings of BSP chief Mayawati at a 'mahagathbandhan' rally in Kannauj, earlier today pic.twitter.com/ZGUny3aPET
— ANI UP (@ANINewsUP) April 25, 2019
సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు యూపీలో బద్ధశత్రువులుగా ఉండేవి. అయితే, 2014లో బీజేపీ ఘన విజయం సాధించడం, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రావడంతో ఈ రెండూ దగ్గర కాక తప్పలేదు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేయగా, బీజేపీ కంచుకోట లాంటి గోరఖ్ పూర్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకున్నాయి. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. సమాజ్ వాదీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. యూపీలో చారిత్రకంగా బద్ధ శత్రువులుగా ఉండే మాయావతి, ములాయం సింగ్ యాదవ్ కూడా ఇటీవల దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. ములాయం పోటీ చేస్తున్న మైన్ పురి నియోజకవర్గ ప్రచారానికి మాయావతి విచ్చేశారు.