మణిపురి (ఉత్తరప్రదేశ్): దేశ భవిష్యత్ కోసమే విభేదాలు పక్కన పెట్టి ఎస్పి,బిఎస్పి చేతులు కలిపాయని ఆయా పార్టీల నేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల తరువాత వీరిద్దరు ఒకే వేదికను పంచుకున్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ మణిపూరిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో కలిసి వీరు పాల్గొన్నారు.
ములాయం సింగ్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మాయావతి ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. వెనుకబడిన వర్గాలకు ములాయం రియల్ హీరో అంటూ సంభోదించారు. ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారని మాయావతి ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోది నాటకాలు, అబద్దాలు పని చేయవని మాయావతి అన్నారు. వెనుకబడిన వర్గాలకు మోది చేసింది ఏమీలేదని విమర్శిస్తూ..వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పి, బీఎస్పి ఆలోచిస్తాయని మాయావతి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల విజయం ఖాయమని మాయావతి పేర్కొన్నారు. ములాయం సింగ్ సరైన వారసుడు అఖిలేష్ యాదవేనని అన్నారు.
ములాయం సింగ్ మాట్లాడుతూ సమాజ్ వాది పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మాయావతిని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూ..తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడంపై మాయావతికి కృతజ్ఞతలు తెలియజేశారు.
లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఉత్తరప్రదేశ్లో ఎస్పి, బిఎస్పిలు చేతులు కలిపి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
పొత్తులో భాగంగా యుపిలోని 80సీట్లకు గానూ చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.