(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కశ్మీర్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కశ్మీర్ సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కశ్మీర్ విషయం భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని.. రెండు దేశాలు చర్చించుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధానితో మోదీ మాట్లాడతారని..ఆయన ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేస్తారని ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తామని అన్నారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్ కు సహకరిస్తామని ట్రంప్ చెప్పారు. మరోవైపు కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని స్పష్టంచేసిన మోదీ…
ఈ అంశంలో ఇతర దేశాల జోక్యం గురించి పెద్దగా పట్టించుకోబోమని అన్నారు. 1947 కన్నా ముందు భారత్, పాకిస్థాన్ దేశాలు కలిసే ఉన్నాయని ప్రధాని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని ఇద్దరం కలిసి పరిష్కరించుకుంటామని మోదీ అన్నారు.