అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. జగన్ను కలిసేందుకు చిరంజీవికి సీఎంఓ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది. చిరంజీవికి సీఎంఓ నుంచి ఎలాంటి అపాయింట్మెంట్ ఖరారు కాలేదని సమాచారం. ఈ నెల 14న మెగాస్టార్కు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఖరారైందట. సైరా హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు వైఎస్ జగన్ ను కలవబోతున్నారు. సైరా సినిమాకు సంబంధించిన విషయాల గురించి సీఎం జగన్ తో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చిరంజీవి ఆయనతో సమావేశం కాలేదు. చాలా కాలంగా వీరిద్దరూ కలిసింది కూడా లేదు. చిరంజీవి తొలి సారి జగన్ ను కలవటానికి అమరావతికి వస్తున్నారు. దీంతో వీరి భేటీపై రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
సైరా నరసింహారెడ్డి సినిమా విజయం సాధించిన తర్వాత చిరంజీవి వరుసగా పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడి చరితను తెరకెక్కించిన విధానాన్ని వివరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను కలిసిన చిరంజీవి.. సైరా సినిమా చూడటానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాదు గవర్నర్ కోసం హైదరాబాద్ లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. అనంతరం ఈ సినిమా చాలా బాగుందంటూ గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను కూడా సైరా సినిమా విషయంలోనే కలవబోతున్నారు చిరంజీవి. ఈ సినిమాకు ఏపీలో ప్రత్యేక షోలు వేసేందకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం జగన్ కు చిరంజీవి ధన్యవాదాలు తెలుపనున్నారని సమాచారం. కారణం సైరా సినిమానే అయినా చిరంజీవి నేరుగా వచ్చి జగన్ తో సమావేశం కానుండడంతో అటు సినీ..ఇటు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.