(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొన్న ఆదివారం ఒక యుట్యూబ్ సాంగ్ వీడియో లింక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పాటను వెరీ హ్యాపీ సాంగ్గా అభివర్ణించారు. ఇంతకీ ఆ పాట దేనిమీదో తెలుసా. మహిళల రుతుక్రమం మీద. ఆశ్చర్యంగా ఉందా. నిజమే ప్రతి నెలా జరిగే ఆ ప్రకృతి సహజమైన సంగతిని అదేదో దాచుకోవాల్సిన, సిగ్గు పడాల్సిన విషయంగా భావించనక్కర లేదని సందేశం ఇచ్చేందుకు ఆ పాట రూపొందించారు.
28 ఏళ్ల తారీఖ్ ఫైజ్ ఎంబిబిఎస్ చదివారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు. ఆయన ఈ పాట రాశారు. ఆయన బంధువు రమీజ్ రాజా పాటకు సంగీతం సమకూర్చారు. మే నెల 28న జరిపే నెలసరి పరిశుభ్రత దినోత్సవం కోసం ఈ పాట తయారుచేయాలని తారీఖ్ స్వగ్రామమైన అకోలాలోని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్ణయించింది.
ఆహనా ఇన్నొవేషన్స్ అండ్ సోషల్ వెంచర్స్ అనే ఈ సంస్థ గ్రామీణ బాలికలలో, మహిళలలో నెలసరి సమయంలో పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ఈ సంస్థ పని. అరకొర నిధులతో కృషి చేస్తున్న సంస్థ కాబట్టి అక్కచెల్లెళ్లయిన గాయనీమణులు కృతిక, రసిక బోర్కర్ ఉచితంగా పాట పాడారు.
యానిమేషన్ వీడియో ఒకటి రూపొందించి ఈ పాటను గత మె నెల 28వ తేదీన అకోలాలో ప్రదర్శించారు. అది చూసిన జిల్లా పరిషత్ సిఇఓ ఆయుష్ ప్రసాద్ మరింత మంచి వీడియో రూపొందించేందుకు నడుం కట్టుకున్నారు. ముంబైకి చెందిన దర్శకుడు ప్రీతిష్ పటేల్ ఉచితంగా వీడియో తయారీ బాధ్యతను స్వీకరించారు. పూనా దగ్గరున్న భోర్ గ్రామంలో షూటింగ్ జరిగింది. వీడియోలో కనబడే పిల్లలు, పెద్దలు అందరూ అక్కడివారే. వృత్తి రీత్యా నటులు ఒక్కరు కూడా లేరు. పాట వీడియోకు వచ్చిన స్పందన అపూర్వం. పాట మీరూ చూడండి: