అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని.. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదన్నారు. విభజనతో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయామని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ అలుపెరగని పోరాటం చేశారని ఆళ్ల నాని వివరించారు.
హోదా కోసం పోరాడిన వారిపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణి వల్ల రాష్ట్రం విడిపోయిందన్నారు. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి.. సోనియాతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్కు కులతత్వాన్ని అంటగడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు కమీషన్లు దండుకుని పోలవరం నిర్మాణంపై దృష్టిపెట్టలేదన్నారు.