(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం ప్రాంతీయ విద్వేషాలకు కారణం అవుతున్న నేపథ్యంలో ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండం అవుతుందా కాదా అన్న విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు రాజధానులు అంశమే రెఫరెండం కాబోతుందని పేర్కొన్నారు.అయితే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు వైసిపి ప్రభుత్వ పాలనకు రిఫరెండం కాదని అన్నారు. స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకమని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో వైసిపి అన్ని చోట్ల విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు మాదిరిగా తమ ప్రభుత్వం పూటకోమాట చెప్పదని అవంతి స్పష్టం చేశారు. రాజధానుల అంశం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపదని అన్నారు. రాజధాని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, రాజధాని రైతులకు మేలు చేసే నిర్ణయాలనే సిఎం తీసుకుంటారనీ అవంతి వివరించారు. రాజధానిలో తాజా పరిణామాలపై స్పందిస్తూ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. అధికారంలో ఉన్నది వైసిపి అన్న విషయం టిడిపి గుర్తుంచుకోవాలని అవంతి వ్యాఖ్యానించారు.