విశాఖపట్నం: ఏపీ రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ మొదటికే వచ్చారు. ఏపీ అసెంబ్లీలో భాగంగా మండలిలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ మళ్లీ మాట మార్చారు. రాజధానిపై స్పష్టత కోసం ఓ కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దానిపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధాని రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో దుర్భాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని బొత్స మండిపడ్డారు. విశాఖ మెట్రోను రెండు ఫేజ్లుగా చేయాలని నిర్ణయించామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుపై మళ్లీ టెండర్కు వెళ్లే విషయంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్లో ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన సీఆర్డీఏ సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానిలో ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాజాగా శాసనమండలిలో ఓ సభ్యుడు వేసిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం ఇస్తూ అమరావతిలోనే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని, రాజధానిని తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అంతా భావించారు. అయితే, మళ్లీ రాజధాని విషయంలో కమిటీ రిపోర్టును బట్టి ఉంటుందని మంత్రి బొత్స చెప్పడం రాజకీయవర్గాల్లో దుమారం రేగుతోంది.
గతంలో రాజధానిపై బొత్స చేసిన ప్రకటనలతో రాజధాని రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అమరావతి ఒకే సామాజికవర్గానికి మేలు చేసేలా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. రాజధాని సహా జిల్లాల అభివృద్ధి కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చాకే రాజధాని భవితవ్యం తేలుతుందని, కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.