అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో సారి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం రాజధానికి ఉన్నది టెంపరరీ అడ్రస్సే అని బొత్సా తేల్చి చెప్పారు. రాజధాని బంగారు బాతులా చేశానంటూ చంద్రబాబు తెగ చెప్పుకుంటున్నారు ఇప్పుడీ బంగారు బాతు ఎక్కడ ఉందని బొత్స ప్రశ్నించారు. రాజధాని బంగారు బాతు కాదు..అడ్రస్ లేని బాతుగా తయారైందని బొత్స వ్యాఖ్యనించారు. బిజెపిలో రెండు రకాల వాయిస్లు వినిపిస్తున్నాయని బొత్స అన్నారు. రాజధానిపై కమిటీ వేశాం కదా రాజధాని అడ్రస్ త్వరలో చెబుతామని బొత్స అంటూ ప్రస్తుతం రాజధానికి ఉన్నది టెంపరరీ అడ్రస్సేనని పేర్కొన్నారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు నాకు ఎసిబి ఉంది, నాకూ పోలీసులు ఉన్నారు, సెక్షన్ 8 ఉందంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు రాత్రికి రాత్రి ఎందుకు వచ్చేశారని బొత్సా ప్రశ్నించారు.రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు పర్యటించి ఏం చూస్తారని బొత్సా ప్రశ్నించారు. కరకట్ట మీద చంద్రబాబు ఇల్లు చూస్తారా, రమ్మంటే తాను కూడా వచ్చి అన్ని చెబుతానని బొత్సా అన్నారు.
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలనేది చంద్రబాబు థియరీ అని, అవినీతి విషయంలో చంద్రబాబు ఈ థియరీ ఫాలో అవుతారని బొత్స విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను బొత్స విమర్శించారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండటానికి వచ్చానని చెబుతున్న పవన్ ఇంకా 15 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలంటే జాగ్రత్తగా వ్యవహరించాలని బొత్స సూచించారు. తాట తీస్తా, ఊరి కొస్తా అంటూ పవన్ మాట్లాడటం సరికాదని బొత్స అన్నారు. ‘ ఆయన ఊరి కొస్తే ఏటవుద్ది, ఏమి కాదు, ఒ పది మంది వస్తారు, చూసి వెళ్లిపోతారు అంతే’ అంటూ బొత్స వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్కు భవన నిర్మాణ కార్మికుడు అంటే డెఫినెషన్ తెలుసా అని బొత్స ప్రశ్నించారు. తట్టా, బుట్టా పట్టుకున్న ప్రతి ఒక్కరూ భవన నిర్మాణ కార్మికుడు కాదని బొత్సా అన్నారు.