అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ పత్రికా స్వేచ్చకు భంగం కల్గించేలా వైసిపి ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకువచ్చిందా, ఏదైనా చట్టాన్ని సవరించిందా అని ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగా, చట్టపరంగా అందరినీ గౌరవించుకుంటూ ముందుకు వెళుతుందని బొత్స అన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామనీ, చట్టాన్ని మాత్రం చేతుల్లోకి తీసుకోమనీ బొత్స స్పష్టం చేశారు. గతంలో మీడియాపై ఆంక్షలు పెట్టింది ఎవరని ఆయన ప్రశ్నించారు.
సాక్షి ప్రతినిధులను మీడియా సమావేశాల నుండి బయటకు పంపించింది గుర్తు లేదా అని బొత్స ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో అన్ని మీడియా సంస్థల విలేఖరులను సమావేశాలకు ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. పత్రికా స్వేచ్చకు వైసిపి ప్రభుత్వం భంగం కల్గిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బొత్స తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. టిడిపి హయాంలో చంద్రబాబు సాగించిన జులంలో వీసమెత్తు కూడా తాము ప్రదర్శించడం లేదని బొత్స అన్నారు. ఈ అయిదు నెలల్లోనే చంద్రబాబు ఎందుకు ఆవేశపడుతున్నారని బొత్సఅన్నారు. ఎన్ని ముసలి కన్నీరు కాల్చినా, కొత్త నాటకాలు, డ్రామాలు వేసినా ఆయన్ను ప్రజలు విశ్వసించరని బొత్స వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున అప్పులు తీసుకువచ్చి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని బొత్స విమర్శించారు. పత్రికా సంస్థలకు పెద్ద ఎత్తున బకాయిలు టిడిపి ప్రభుత్వం చెల్లించలేదని బొత్స గుర్తు చేశారు. బాబు ప్రభుత్వం 47వేల కోట్ల రూపాయల అప్పు మిగిల్చిపోయిందని బొత్స అన్నారు.