అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై బొత్సా ఆదివారం స్పందించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మైండ్ సెట్, వారి తాలూకు పార్టీ అజెండా మారలేదనీ, అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని బొత్సా విమర్శించారు. భూదోపిడీ చేస్తే సహించబోమని నాడు పవన్ కల్యాణ్ అనలేదా అని బొత్సా ప్రశ్నించారు. కులాల రొచ్చులేని రాజధాని కావాలని తమరు అనలేదా అని బొత్సా ప్రశ్నించారు. ఎవరు తీరు ఏంటో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. పవన్ ద్వంద్వ వైఖరి, ద్వంద్వ విధానం అర్దం కావడంలేదని బొత్సా వ్యాఖ్యానించారు.
ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమనీ,అందుకే తాను వైసిపిలో చేరాననీ బొత్సా అన్నారు. తాను జగన్మోహనరెడ్డి మాయలో పడ్డానో లేదో కానీ చిత్తశుద్ధి ఉన్న సిఎం జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని బొత్సా అన్నారు. తమ పార్టీకి కాల మహిమ వల్ల 151 సీట్లు రాలేదనీ, చిత్తశుద్ధి ఉందనే ప్రజలు జగన్ను ఎన్నుకున్నారని బొత్సా వివరణ ఇచ్చారు. వోక్స్ వ్యాగన్ కేసులో తనను సాక్షిగానే పిలిచారని బొత్సా చెప్పారు.
పవన్ కల్యాణ్,చంద్రబాబు ఇంటికి జాగా ఇచ్చిన వ్యక్తి ఒకరే కాదా అని బొత్సా ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రశ్నించలేదని బొత్సా అన్నారు. చంద్రబాబు, ఆయన తాలుకూ ఆర్దిక లావాదేవీలకు పవన్ మద్దతు ఇస్తున్నారని బొత్సా విమర్శించారు. రాజధానికి ఐదు వేల ఎకరాలు సరిపోతుందని నాడు పవన్ అనలేదా బొత్సా ప్రశ్నించారు. ఎవరు తీరు ఏంటో ప్రజలు గమనిస్తున్నారని బొత్సా పేర్కొన్నారు.
ఒక రాజధానిలో వేయి కుంభకోణాలు జరిగాయని బొత్సా ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకొని ప్రజలకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నామని బొత్సా అన్నారు. అభివృధ్ది పేరిట దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎంఎల్ ఏల క్వార్టర్ల నిర్మాణంలో సైతం అవినీతి జరిగిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్లో అవినీతిని అరికట్టడం తప్పా అని బొత్సా ప్రశ్నించారు. పోలవరం తెలుగుదేశంకు ఏటిఎం అని సాక్షాత్తు ప్రధాని వ్యాఖ్యానించిన విషయం గుర్తు లేదా అని బొత్సా ప్రశ్నించారు. ఏమి సమాచారం లేకపోతే ప్రధాని అలా ఎందుకు మాట్లాడతారని బొత్సా అన్నారు. దానిపై తమ ప్రభుత్వం చర్య తీసుకుంటే తప్పా, మాట్లాడితే తప్పా అని బొత్సా ప్రశ్నించారు.