అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందన్నారు. ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల అవసరాలను గమనించాలని, ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు.. గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాంతాల అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ఒక ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరించాలని ప్రయత్నించిందని తెలిపారు. ఇతర ప్రాంతాల ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, అందుకే గత ఎన్నికల్లో టీడీపీని ఓడించారన్నారు. ప్రజల, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా.. బలం ఉందని ఏకపక్షంగా నాడు అమరావతిని ప్రకటించారని బొత్స ఆరోపించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. రెండు కమిటీలు వేసి అధ్యయనం చేయించామన్నారు. హైపవర్ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని, వికేంద్రకరణ వల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని బొత్స చెప్పారు.
రైతులతో గత ప్రభుత్వ ఒప్పందాలను కొనసాగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చే 2500 పెన్షన్ను ఐదు వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ రైతులకు ప్లాట్లు ఇస్తామన్నారు. రైతులకు ఇచ్చే కౌలులో జరీబు భూములకు ఐదు వేలు.. మెట్టభూములకు మూడు వేలకు పెంచాలని నిర్ణయించామన్నారు. రైతులకు ఇచ్చే కౌలును పది నుంచి 15 ఏళ్లకు పెంచుతామని బొత్స స్పష్టం చేశారు. రియల్ఎస్టేట్ కోసమే రాజధానిలో ఇతర ప్రాంతాల వారు భూములు కొన్నారని, రైతుల ముసుగులో శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని టీడీపీ ప్రయత్నం చేస్తోందని మంత్రి బొత్స విమర్శించారు.