న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు పేరు మోసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఈసారి ఇఫ్తార్ విందుపై పడ్డారు. ఆయన చేసిన ఒక వ్యాఖ్య బీహర్లోని అధికార భాగస్వామి జనతాదళ్ (యు) నాయకత్వానికి కూడా చికాకు కలిగించింది.
బీహార్లో ముఖ్యమంత్రి నితిష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అందరూ కలిసి ఇఫ్తార్ విందు సందర్భంగా నవ్వుతూ దిగిన ఫొటోను చూపుతూ, ‘ఇంతే ఉత్సాహంగా నవరాత్రి విందు నిర్వహిస్తే ఎంత బావుండేది! మనం ఎందుకు మన మతాచారాల దగ్గరకు వచ్చేసరికి వెనకాడి ఇలా నటిస్తూ ఉంటాం!’ అని గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రిమండలిలో ఒకటే పదవి ఇవ్వజూపినందుకు బిజెపిపై కినుకగా ఉన్న జనతాదళ్ (యు) నాయకత్వానికి ఇది ఇంకాస్త చిరాకు పుట్టించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ స్పందిస్తూ, ‘ఇలాంటి వ్యాఖ్యలు ఆయనకు అలవాటే. ఆయనకు మెంటల్ చెకప్ అవసరం’ అని వ్యాఖ్యానించారు.
లోక్ జనశక్తి పార్టీ పార్లమెంటటరీ బోర్డు ఛైర్మన్ చిరాగ్ పశ్వాన్, ‘మేము అన్ని పండుగలూ చేస్తాం. గిరిరాజ్ సింగ్జీ ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు’ అని అన్నారు.