(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నిబంధనలు పౌరులకు మాత్రమే.. మాకు కాదు.. మేం ఏం చేసినా అడిగేవారు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. తాజాగా తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా మోటార్ బైక్ నడపడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సూర్యాపేటలో పర్యటన సందర్భంగా సద్దుల చెరువుకట్ట మినీ ట్యాంక్ బండ్పై మంత్రి జగదీశ్ రెడ్డి మోటార్ బైక్ నడిపారు. వెనుక ఓ వ్యక్తిని కూర్చోబెట్టుకుని, హెల్మెట్ ధరించకుండా నడిపారు. పక్కనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాక్షాత్తూ మంత్రే ఇలా చట్టాలను తుంగలో తొక్కితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే నిబంధనలను పాటించకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చట్టాలను పాటించి, సామాన్యులకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే ఇలా ప్రవర్తిస్తే ఇక చట్టాల గురించి సరైన అవగాహన లేని వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారిని కూడా మంత్రిని ఉపేక్షించినట్లే ఉపేక్షిస్తారా ? అని నిలదీస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మంత్రికి జరిమానా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సెప్టెంబరు ఒకటో తేదీన నుంచి కొత్త మోటార్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత డ్రైవింగ్ విషయంలో అజాగ్రత్తగా ఉన్న వారికి జరిమానాల మోత మోగుతోంది. ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా.. డ్రైవింగ్ చేసే సమయంలో వాహనాలకు చెందిన కీలక పత్రాలను తీసుకెళ్లని సాధారణ పౌరులకి పోలీసులు చలాన్లు వేస్తున్న సంగతి తెలిసిందే.