అమరావతి: ‘కరోనా వైరస్’ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, దాని కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ చైనాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంటే, ఏపీలో ఎల్లో వైరస్ చెలరేగిపోతోందని విమర్శించారు. ఏపీలో పెన్షన్ లబ్ధిదారులను తగ్గించారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. “ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని, చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావుల పేర్లు ఉంటేనే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చినట్టా!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వనరులను దోచుకోవచ్చన్నది ఎల్లో మీడియా ప్రణాళిక అని నాని ఆరోపించారు.
ఫిబ్రవరి 1న ఒక్క రోజే 54 లక్షల మందికి గ్రామవాలంటీర్లు పెన్షన్లు అందించారన్నారు. రైతుబంధు ద్వారా అన్నదాతలకు జగన్ రూ.13,500 ఆర్థిక సాయం చేశారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం కోటి మందికిపైగా ఆర్థిక సాయం చేశామన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు పసుపు కుంకమ అంటే.. డబ్బా మీడియా ఊదరగొట్టాయని నాని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన జగన్ను ఎప్పుడు దింపేద్దామా? అని బాబు, ఎల్లో మీడియా ఎదురు చూస్తోందని నాని ధ్వజమెత్తారు. పార్టీలకు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామ సెక్రటేరియట్, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పథకాలను, ప్రభుత్వం నుంచి సాయం చేస్తున్నారు. ఏడు నెలల్లో ఏడు లక్షల మందికి పెన్షన్లను కోత పెట్టారని ఎల్లో మీడియాలో వార్తలొచ్చాయని, జగన్ మీద 420 కేసులు ఉన్నాయని బాబు ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బతుకే 420 బతుకని కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.