హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ టికెట్ ఇప్పించేందుకు మంత్రి మల్లారెడ్డి, డబ్బులు డిమాండ్ చేశారని చెబుతూ ఉన్న ఆడియో కలకలం రేపుతోంది. బోడుప్పల్కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడిన ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో ఆడియో తెగ వైరల్ అవుతోంది. టికెట్ల కోసం డబ్బులు అడిగిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయంటూ మంత్రి మల్లారెడ్డితో రాపోలు రాములు మాట్లాడినట్టుగా ఆ ఆడియోలో ఉంది. టికెట్ల కోసం మల్లారెడ్డి డబ్బులు అడిగిన సాక్ష్యాలు, రికార్డులు తన దగ్గర ఉన్నాయని రాపోలు రాములు చెబుతున్నారు. తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. తనకు అన్యాయం చేశావని మల్లారెడ్డిని రాములు నిలదీశారు. మొత్తం వ్యవహారాన్నీ కేసీఆర్, కేటీఆర్ ముందుంచుతానని హెచ్చరించారు.
టీఆర్ఎస్ వర్గాల్లో మల్లారెడ్డి ఫోన్ ఆడియో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఫిర్జాదిగూడకు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు పార్టీ మారారు. తిరిగి బుజ్జగింజడంతో సొంత గూటికి చేరుకున్నారు. తాజాగా ఈ ఆడియో వ్యవహారం బయటకు రావడంతో ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేశామని రాపోలు రాములు ఆరోపించడం.. దానిని మంత్రి మల్లారెడ్డి ఖండించకపోవడంతో ఈ వ్యవహారం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది.
ఇదిఇలా ఉంటే మున్సిపల్ ఎన్నికలపై జరిగిన సమావేశంలో మల్లారెడ్డి తీరుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ ఫోన్ కాల్ వ్యవహారం విషయం తెలుసుకున్న కేసీఆర్, మల్లారెడ్డిపై తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో ఓ వేదికపై మల్లారెడ్డి గొడవపడిన సంగతి తెలిసిందే. తాజాగా మల్లారెడ్డి ఇలా ఆడియోతో బుక్ కావడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
https://youtu.be/SgD6sPxxsQQ