అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామాలకు కొన్ని పద్ధతులు ఉంటాయని, మండలి రద్దు తర్వాత కేంద్రం నుంచి సమాచారం వచ్చాక రాజీనామా చేస్తామని చెప్పారు. మండలి రద్దుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. మండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి మండలి రద్దు సమాచారం రాగానే మంత్రి పదవికి రాజీనామా చేస్తామని వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని స్పష్టం చేశారు.
శాసనమండలిని రద్దుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అసెంబ్లీలో పెట్టిన తీర్మానానికి కూడా సభలో ఆమోదం లభించింది. విపక్ష టీడీపీ తీరుపై మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసే మండలి రద్దు చేయాలని సీఎం జగన్ కు ప్రతిపాదించారు. దీంతో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అయితే, శాసనమండలి రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానం కేంద్రానికి చేరిన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలపై చర్చ మొదలైంది. మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా చేసినప్పటికీ వారికి అండగా ఉంటామని సీఎం జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. మంత్రి పదవులు లేకపోయినా పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మండలి రద్దు ప్రతిపాదనపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే మంత్రుల రాజీనామాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా, రాజకీయంగా కూడా నష్టం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మండలి రద్దుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభిస్తే తప్ప మంత్రులతో రాజీనామాలు చేయించడం మంచిది కాదని వైసీపీ భావిస్తోంది. మంత్రులిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు జోగి రమేష్, పొన్నాడ సతీష్ కుమార్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.