అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలతో పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అయితే, మత్స్యకారులు తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మోపిదేవి మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి ఆ దేశం చెరలో చిక్కుకున్నారని తెలిపారు. ఆ విషయాన్ని జాలర్ల కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. మత్స్యకారులను విడిపించేందుకు వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మంత్రి తెలిపారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి మత్స్యకారుల కుటుంబాలు ఎన్ని సార్లు తీసుకెళ్లిన పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఈ నెల 6న మత్స్యకారులు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి చెప్పారు. కానీ టీడీపీ నేతలు మాత్రం తమ చొరవతోనే విడుదల అవుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తం 22 మందిలో 20 మంది మాత్రమే వారు విడుదల అవుతున్నారని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారి విషయంలో సమాచారంలోపం కారణంగా వారు మరోనెలరోజులలో విడుదల అయ్యే అవకాశం ఉందని వివరించారు. జగన్ గారు సిఎంగా అయిన నాటి నుంచి 22 కుటుంబాలకు ప్రతినెలా 4,500 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. మత్స్యకారులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడిందని చెప్పారు.
ఇక, రాజధాని అంశంపై మంత్రి మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేలా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఉందని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బీసీజీ కమిటీ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. బీసీజీ కమిటీ మీద కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని.. బీసీజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కమిటీ అని పేర్కొన్నారు. చంద్రబాబుతోనూ బీసీజీ కమిటీ కలిసి పనిచేసిందని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశం సీఎం వైఎస్ జగన్కు ఉందన్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో కొంత ఆందోళన ఉందని.. రైతులకు అన్యాయం జరగకుండా సీఎం చూసుకుంటాని హామీ ఇచ్చారు. పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. మహిళలకు ఇబ్బంది కలిగించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, రైతులు శుక్రవారం కొందరు పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అందుకే, వాళ్లు అలా వ్యవహరించి ఉండొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. హైపవర్ కమిటీ ఈ నెల 6న సమావేశమవుతుందని, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇస్తామని మంత్రి మోపిదేవి చెప్పారు. రాజధాని కట్టడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. హై పవర్ కమిటీ నివేదికను చట్టసభల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.