(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో భూములను మళ్ళీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చి తిరిగి ఇచ్చేయవచ్చన్నారు. సోమవారం మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాజధాని రైతులకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ అభిమతమని చెప్పారు. బోస్టన్ గ్రూపు నివేదిక జనవరి మూడవ తేదీన ప్రభుత్వానికి అందుతుందని, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం అంతటా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. బోస్టన్ గ్రూపుపై అవాకులు చెవాకులు పేలుతున్న టీడీపీ నేతలు.. ఆ గ్రూపు సేవలను పలు సందర్భాలలో చంద్రబాబు కూడా వినియోగించుకున్న విషయం గుర్తించాలన్నారు.
రాజధాని ప్రాంత రైతాంగంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వారికి మంచి ప్యాకేజి ఇచ్చి న్యాయం చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతుల పక్షాన మాట్లాడుతున్నా అనడం విచిత్రంగా వుందన్నారు. 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసేయాలంటే సాధ్యం కాదని, తగుమాత్రంలో భూమి తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ పేరిట తీసుకున్న భూములను అదే పేరుతో తిరిగి రైతులకు ఇచ్చేయొచ్చన్నారు. రాయలసీమకు కావాల్సింది రాజధానో, సచివాలయమో కాదని.. సీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు కావాలని తెలిపారు. చంద్రబాబు రాజధాని రైతులను ముంచేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ది ఒకే చోట కేంద్రీకృతమైతే ఇబ్బందులొస్తాయని, గతంలో హైదరాబాద్ విషయంలో ఇదే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రైతులతో మాట్లాడాల్సిన పని లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.