(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్ ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే జగన్ అన్నారని, ‘ఉండొచ్చు’ అనే మాటకు..‘ఉంటుంది’ అనే మాటకు చాలా తేడా ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానిపై జగన్ ఏం చెప్పారని ఇంత చర్చ జరుగుతోందని ప్రశ్నించారు. మూడు చోట్ల రాజధాని ఉండొచ్చని మాత్రమే జగన్ అన్నారని.. ఇక్కడైనా ఉండొచ్చు.. మరెక్కడైనా ఉండొచ్చని బాంబ్ పేల్చారు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందన్నారు. సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలనేది రిపోర్టులో ఉంటుందని.. ఒక చోట సెక్రటేరియెట్.. మరో చోట అసెంబ్లీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. అంతా ఒక్క జిల్లాలోనే ఉండాలనే భావన కరెక్ట్ కాదని.. కమిటీ ఇచ్చే నివేదికలో అలా ఉండొచ్చు.. కావచ్చు అనే సీఎం అన్నారని గుర్తు చేశారు.
ప్రతిపక్షాలు చేసే విమర్శలు చూస్తుంటే జగన్ పై వారికి ఎంత ద్వేషం ఉందో అర్ధమౌతుందని అన్నారు. రాజధాని విషయంలో నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం చెప్పలేదని పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ధైర్యంగా చెప్పే సత్తా జగన్కు ఉందని.. ప్రజాస్వామ్యవాదిగా అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. నివేదికలో ఇలా ఉండొచ్చనే రీతిలో మాత్రమే సీఎం చెప్పారని.. ప్రజల ఆకాంక్ష మేరకు రిపోర్టు ఉంటుందని.. కానీ మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. రాజధాని పేరుతో భారీగా అక్రమాలు జరిగాయని.. అక్రమార్కులను గుర్తించి అవసరమైతే జైలుకు పంపుతామన్నారు. అమరావతిలో రైతుల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఎంత మంది? రోడ్డెక్కిన రైతులు ఎంతమంది? అని ప్రశ్నించారు. టీడీపీ ఒత్తిడితో కొందరు ఇలా ఆందోళనలు చేస్తున్నారని.. నిజమైన రైతులు రోడ్లపైకి రావడం లేదన్నారు. ఇక చంద్రబాబును నమ్మి మోసపోయిన రైతుల్ని జగన్ ఆదుకుంటారని.. ఆయన మాటిస్తే దానిపైనే నిలబడతారని చెప్పారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలనుకుంటే.. ఐదేళ్లలో అందరికీ ఎందుకు ప్లాట్లు ఇవ్వలేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతిపరులు, ధనవంతులకే ప్లాట్లు ఇచ్చారని విమర్శించారు.
పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షం అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రాజధానిపై చర్చ జరుగుతుంటే దానిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని పైగా బయటికి వచ్చాక తుగ్లక్ పాలనగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతమాత్రం సమంజసం కాదని మంత్రి అన్నారు. విశ్వాసానికి మారుపేరు జగన్ అని వంచన, నమ్మకద్రోహానికి మారుపేరు ప్రతిపక్షనేత అని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏ ఆలోచన చేసినా చాలా ముందు చూపు దూరదృష్టితో చేస్తారని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమన్నారు. త్వరలోనే రాజధానిపై కమిటీ నివేదికను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజల సలహాలు సూచనలు తీసుకుని రాజధాని విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదిక బయట పెట్టలేదని, కనీసం చట్టసభలో కూడా చర్చించలేదని ఆరోపించారు. కమిటీలో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని మంత్రి వెల్లడించారు. చాలా రాష్ట్రాల్లో సచివాలయం, హైకోర్టు వేరు వేరు చోట్ల ఉన్నాయని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నాం తప్ప వేరే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేశారు.