(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రతాప్ సారింగి సోషల్ మీడియాలో పెద్ద హీరో. అత్యంత నిరాడంబరమైన ఆయన జీవన విధానం దేశప్రజల దృష్టిని ఆకర్షించింది., పూరిగుడిసె నివాసం, చిన్న సంచిలో బట్టలు సర్దుకోవడం, సైకిల్ ప్రయాణం..ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫలితంగా ఆయనకు ఒదిషా మోదీ అనే పేరు వచ్చిపడింది.
ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి. మోదీ సారంగిని చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, పశుసంవర్ధకం, డెయిరీ, ఫిషరీస్ శాఖలో సహాయ మంత్రిగా నియమించారు. కేంద్రమంత్రి పదవి వరించడంతో సారంగి గతంపై కూడా మీడియా దృష్టి పడింది. ఆయనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అల్లర్లు, దహనకాండ, దాడి, ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. 2002లో ఒదిషా అసెంబ్లీపై భజరంగ్దళ్ కార్యకర్తలు దాడి చేసిన కేసులో సారంగిని అరెస్టు చేశారు. ఆయన భజరంగ్దళ్ నాయకుడిగా ఉన్నపుడే 1999లో ఒదిషాలో ఆస్ట్రేలియా మతబోధకుడు గ్రాహం స్టెయిన్స్, ఆయన పిల్లలను సజీవ దహనం చేశారు.
సారంగి మాత్రం ఈ కేసులన్నీ అక్రమంగా బనాయించినవేనని అంటారు. తాను పోలీసుల అక్రమాలపై అవినీతిపై పోరాటం చేస్తాను కాబట్టి వారు కేసులు బనాయిస్తారని ఆయన ఎన్డిటివితో అన్నారు. గ్రాహం స్టెయిన్స్ కేసుతో తనకేమాత్రం సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
సారంగి దీర్ఘకాలంగా ఆరెస్సెస్ సభ్యుడు. ఆయన భజరంగ్దళ్లో కూడా పని చేశారు. బాలసోర్ జిల్లా, నీలగిరి అసెంబ్లీ సిటు నుంచి రెండు సార్లు ఎన్నికయిన సారంగి ఈసారి బాలసోర్ లోక్సభ స్థానం నుంచి 13 వేల వోట్ల మెజారిటీతో గెలిచారు.