అమరావతి: కృష్ణాజిల్లా వాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ అనుమతులు మంజూరు చేయడంతో ఈ ప్రాంత వాసుల కల నెరవేరబోతోంది.
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పరిధిలో సముద్రతీరానికి సమీపంలో ఉన్న గుల్లలమోద గ్రామంలో ఈ ప్రాజెక్టు రాబోతోంది. 1200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని పరీక్షా కేంద్రానికి అనువైనదిగా గుర్తించారు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణాలు ప్రారంభమైతే స్థానికులకూ పెద్ద ఎత్తున పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివాసం ఉండనున్నారు. 386 ఎకరాలలో అవసరమైనంత మేరకే స్థలాన్ని వినియోగించుకోనున్నారు. మిగిలిన పరిసర ప్రాంతాల్లో పచ్చదనానికి పెద్ద పీట వేయనున్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీల్లో ఈ భారీ ప్రాజెక్టు కూడా ఒకటి. ఈ ప్రాజెక్టు పూర్తియితే భారతరక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
2011లోనే ఇక్కడ బాలాసోర్ కంటే మెరుగైన సదుపాయాలతో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2012లో అనేక ప్రాంతాలను పరిశీలించిన తరువాత గుల్లలమోద అనువైనదిగా తేల్చారు. ఇందుకు గానూ 386 ఎకరాలను గుర్తించారు. 2017లో రక్షణ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. రెవెన్యూ ఆధీనంలోని 321 ఎకరాలకు, అభయారణ్యంలోని భూములకు కలిపి మొత్తం 35 కోట్ల రూపాయలు చెల్లించారు. అదే సంవత్సరంలో తొలి దశ అనుమతి లభించింది,. 2018లో ఈ ప్రాంతాన్ని సీఆర్జడ్ నుండి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2019లో రెండో దశకు అనుమతులు మంజూరు లభించింది.