(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హిందువులను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పవన్ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. హిందూమతం, ధర్మం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా పవన్ మాట్లాడారని, ఆయన ఇతర మతానికి మారిపోయినట్టు అనిపిస్తోందని తెలిపారు. లౌకికతత్వంపై కనీస అవగాహన లేని పవన్, తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోకుంటే, ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ హిందువేనా? వేరే మతంలోకి వెళ్ళారా ? జనసేన పార్టీలో హిందువులే లేరా?’ అని రాజాసింగ్ ప్రశ్నించారు. హిందువుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. ‘ఖబర్దార్.. పవన్ కళ్యాణ్’ అంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు.
సోమవారం పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మతాల పేరున విడగొడుతూ రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయిస్తున్నది కూడా హిందువులేనని వ్యాఖ్యానించారు. ఇతర మతాల వారెవరూ హిందూమతాన్ని కించపరచడం లేదని తెలిపారు సెక్యులరిజాన్ని ఇబ్బందులు పెడుతున్నది కూడా హిందూ నేతలేనని పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైంది.