(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు కుటుంబం వైసీపీని వీడి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ… మోహన్బాబు కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే, దీనిపై వెంటనే సరే అని చెప్పకపోయినా… మోహన్బాబు నవ్వుతూ మోదీ ప్రతిపాదనను స్వాగతించినట్లు సమాచారం. మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న ప్రధానిని కలిశారు. మోహన్బాబు ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాను డైనమిక్ లీడర్, ప్రధాని మోదీని కలిశానని మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఓ ట్వీట్ చేశారు. దీన్ని బట్టీ మంచు ఫ్యామిలీ మొత్తం బీజేపీ గూటికి చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Just met The DYNAMIC Hon'ble Prime Minister @narendramodi JI. If only India could hear his vision clearly and purely we would be in a greater place.
— Lakshmi Manchu (@LakshmiManchu) January 6, 2020
గతంలో మంచు మనోజ్ వివాహం సందర్భంగా కూడా ప్రధాని మోదీతో మంచు ఫ్యామిలీ భేటీ అయ్యింది. మనోజ్ పెళ్లికి రావాల్సిందిగా అప్పుడు ఆహ్వానించారు. అప్పటి నుంచి బీజేపీతో మోహన్ బాబు టచ్ లో ఉన్నారు. చాలా రోజుల నుంచే ప్రధానితో మోహన్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో గతంలోనే ఆయన బీజేపీలో చేరతారని అంతా భావించారు కానీ ఆయన చేరలేదు. మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు మోహన్బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరుఫున విసృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు రకరకాల పదువులు ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి అవుతున్న మోహన్ బాబుకు ఏ పదవి ఇవ్వలేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తో మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది. మోహన్ బాబు కోడలు విరోనికా స్వయానా జగన్ బాబాయ్ కుమార్తె.
నిజానికి టాలీవుడ్ నటుల్లో ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీరాజ్ ని నియమించడం మినహా ఇరత నటులకు జగన్ సర్కార్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. నటుడు అలీ సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం అలీకి ఏదో ఒక పదవి వస్తుందని అంతా భావించారు. కానీ అది నేటికి కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ… మంచు ఫ్యామిలీని ఆహ్వానించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీని తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం చాలా మంది టాలీవుడ్ సెలబ్రెటీలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. నటుడు నాగార్జున, అలీతోపాటు పలువురు నటులు సీఎం జగన్ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ గ్లామర్ లేదు. బాలీవుడ్ ను ప్రధాని మోదీ ఆకర్షించినా.. టాలీవుడ్ ప్రముఖులు మాత్రం బీజేపీలో చేరింది లేదు. దీంతో ఆ లోటును మంచు ఫ్యామిలీతో భర్తీ చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో వైసీపీని వీడి… మోహన్ బాబు బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.