సీనియర్ రాజకీయ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి ఎప్పుడు మీడియాతో మాట్లాడినా కుండ బద్దలు కొడతారు. లేదా కనీసం కుండ బద్దలు కొట్టారని అనుకునేలా మాట్లాతారు. ఆయన మాట్లాడితే మంచి వార్త దొరుకుతుంది కాబట్టి మీడియా కూడా ఆయన పట్ల కాస్త మంచిగానే వ్యవహరిస్తుంది.
తాజాగా ఎన్నికలలో డబ్బు ఖర్చు గురించి మాట్లాడి జెసి మీడియాకు వార్త ఇచ్చారు. ఎన్నికలలో మితి మీరిన డబ్బు ఖర్చు అవుతున్న విషయం గతంలో మీడియాకు తెలియదా? తెలిస్తే అది మళ్లీ వార్త ఎలా అయింది? ఎలా అంటే ఒక రాజకీయనాయకుడు దాని గురించి బహరంగంగా మాట్లాడడం అరుదు కాబట్టి! కొన్నాళ్ల క్రితం మరో సీనియర్ రాజకీయ నాయకుడు కోడెల శివప్రసాద రావు కూడా ఇలాగే మాట్లాడారు. మాట్లాడి ఆయన కాస్త ఇబ్బందిలో కూడా ఇరుక్కున్నారు, అది వేరే విషయం.
ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో 10 వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యాయని జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. వోటుకు నోటు విషయంలో ప్రజలు ఎక్కువ డిమాండ్ చేయడమే ఖర్చు పెరగడానికి కారణమని ఆయన అన్నారు. పనిలో పనిగా ఆయన ఇంత డబ్బు ఎక్కడనుంచి వస్తున్నదీ కూడా చెప్పారు. ఇదంతా అవినీతి సొమ్ము తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.
జెసి దివాకర్ రెడ్డి చాలా కాలంగా ఎన్నికల రాజకీయాల్లో ఉన్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్లో ఉన్న జెసి రాష్ట్రవిభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని గ్రహించి టిడిపిలో చేరారు. అధికారపక్షంలో ఉంటే తప్ప ప్రజాసేవ సరిగ్గా చేయలేమని అనుకున్నారు. టిడిపి టికెట్పై అనంతపురం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో తాను తప్పుకుని కుమారుడికి టెకెట్ ఇప్పించారు.
దివాకర్రెడ్డి చెప్పిన విషయాలలో ఆలోచించాల్సిన అంశాలు రెండుమూడు ఉన్నాయి. ఎన్నికల ఖర్చు క్రమేపీ పెరుగుతూ వస్తోందని ఆయనే స్వయంగా అన్నారు కాబట్టి స్వీయ అనుభవం ద్వారానే ఆ విషయం తెలుసుకుని ఉండాలి. మరి తాను అప్పుడే ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదు? ఇన్నాళ్లూ తాను కూడా ఎన్నికల్లో డబ్బు పంచి ఇప్పుడు ప్రజలు ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారని వారిని నిందించడం సబబేనా!
రెండవ విషయం అవినీతి. ఎన్నికల్లో పంచేదంతా అవినీతి సొమ్మేనని దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాను కూడా దీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాజీవనంలో ఉన్నారు కాబట్టి ఆ అవినీతిలో ఆయనకూ భాగస్వామ్యం ఉండుండాలి. లేనిపక్షంలో తాను ఎక్కడనుంచి డబ్బు తెచ్చి పంచిందీ, పంచుతున్నదీ ఆయనే చెప్పి ఉండేవారుగా! ఎన్నికల్లో ఖర్చు పెరిగినట్లే ప్రజాప్రతినిధుల అవినీతి ఆర్జన కూడా ఖచ్చితంగా ఎక్కువై ఉండాలి. ఆ లెక్క ప్రకారం మరి వోటర్లు ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడం కూడా సబబేగా?
చివరగా ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టేందుకు సంపూర్ణమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని దివాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల రాజకీయాల నుంచి విరమించుకుని తన కుమారుడిని వారసుడిగా ప్రకటించిన తర్వాత ఎన్నికలలో సంస్కరణల గురించి దివాకర్రెడ్డి మాట్లాడడం వృద్ధనారీ పతివ్రతా అన్న సామెతను గుర్తు చేయడం లేదూ!
-సురయ్యా